రామోజీ రావు గారు గురించి ప్రత్యేకంగా వివరించాల్సిన పనిలేదు.ఈయన తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితులే.
ముఖ్యంగా పత్రికా ప్రియులకి.రామోజీ రావు వ్యక్తిగతంగా పలు వ్యాపారాల్లో చాలా బిజీగా ఉంటారు.
గొప్ప వ్యాపారవేత్తగా సమాజంలో ఇంత మంచి పేరుంది.అయితే అంతకంటే ఎక్కువగా ఈనాడు పత్రిక ద్వారానే ఈయన అందరికీ పరిచయం.1974లో ఈనాడు స్థాపించినప్పటి నుండి చీఫ్ ఎడిటర్గా రామోజీరావు వ్యవహరిస్తూ ఈనాడు పత్రిక వ్యవస్థలో కీలక బాధ్యతలను పోషిస్తున్నారు.దాదాపు 46 ఏళ్లకు పైగా ఈయన ఈనాడు పత్రికలో తన సేవలను అందిస్తున్నారు.
అయితే ఈ మధ్య ఈనాడు పత్రిక చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పత్రికలో ఎడిటర్ బ్లాక్ వద్ద ఆయన పేరుకి బదులుగా మరొకరి పేరు వినిపించడం ఇలాంటి కొన్ని పరిణామాలు జరిగాయి.
ఆ విషయం పక్కన పెడితే ఈనాడు పత్రిక అంటే రామోజీ రావు, రామోజీ రావు అంటే ఈనాడు పత్రిక అన్నటుగా ఆయన పేరొందారు.
అలా రామోజీ రావు చాలా పాపులర్.ఈయన వద్ద పని చేయాలని ఈయన సారథ్యంలో ముందుకు సాగాలని ఎందరో సీనియర్ జర్నలిస్ట్ లు, రచయితలు సైతం ఎదురు చూస్తుంటారు.
అయితే అలాంటిది స్వయంగా రామోజీ రావు నేరుగా బాధ్యతలు అప్పగిస్తాడు రమ్మంటే ఒక ప్రముఖులు కాదని చెప్పారట.అంతేకాదు ఆయన ఇచ్చిన బ్లాంక్ చెక్ ని తిరిగి వెనక్కి పంపేశారట.
అదేంటి రామోజీ రావు లాంటి వ్యక్తి ఆఫర్ ఇస్తే కాదంటామా ? అందులోనూ బ్లాంక్ చెక్ వద్దన్నారా ? అయినా బ్లాంక్ చెక్ ఇచ్చారంటే అవతలి వారు ఇంకెంత గొప్ప వారో అన్న పలు ప్రశ్నలు ఎదురవుతాయి.
ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.?? తాజాగా సీనియర్ జర్నలిస్టు తోట భావనారాయణ తన సోషల్ మీడియా ఖాతాలో రామోజీ రావు గారు బ్లాంక్ చెక్ ఇస్తే ఆ రచయిత తిరస్కరించి తిరిగి వెనక్కి పంపించారు అని రాసుకొచ్చారు.ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
వార్త పత్రికల్లో ఎపుడు అగ్రస్థానంలో సత్తా చాటే వార్త పత్రిక ఈనాడు.ఈనాడు పత్రిక అంతగా ఆదరణ పొంది పాపులర్ అవడం వెనుక ప్రధాన పాత్ర పోషించింది రామోజీ రావు అనే చెప్పాలి.
అయితే అన్నిటిలోనూ ముందుండే.ఈనాడు పత్రికలో సాహిత్యానికి సరైన స్థానం లేదన్నది సాహిత్యాభిమానుల నుంచి ఎప్పటి నుండో వినిపిస్తున్న ఒక విమర్శ.
అలాగే మంచి సాహిత్యాన్ని జోడించాలి అనేది వారి ఆకాంక్ష కూడా, కాగా ఇందుకు స్పందించి సాహిత్యాభిమానుల ఆకాంక్షను తీర్చాలనే ఉద్దేశం తో రామోజీ రావు.ఓ సాహిత్య పత్రిక తీసుకురావాలని అప్పట్లో ఓసారి నిర్ణయించుకున్నారట.
అందుకోసం ఆయన ప్రయత్నించారట కూడా, అయితే మొదట్లోనే ఆటంకం రావడంతో ఆగిపోయారు.
సాహిత్యాన్ని ఈనాడు పత్రికలో చేర్చాలని ఉద్దేశంతో… విమర్శకుడు, సాహితీశోధకుడు అయిన ఆరుద్ర గారిని ఆయన ఎంపిక చేసుకున్నారట.అయితే ఇదే విషయాన్ని ఆరుద్ర గారికి తెలియచేస్తూ లేఖ రాశారట రామోజీ రావు.అందరూ నన్ను సాహిత్యానికి వ్యతిరేకినని అనుకుంటారు అయితే వాస్తవం అది కాదు.
దిన పత్రికల్లో సాహిత్యానికి మాత్రమే నేను వ్యతిరేకిని ఎందుకో రెండింటికీ పొంతన కుదరదు అనేది ఒక భావన .అయితే అభిమానుల కోరిక మేరకు ఇపుడు ‘భారతి’ స్థాయిలో సాహిత్య పత్రిక పెట్టాలని అనుకుంటున్నారు.అయితే అందుకు మీరు మాట ఇవ్వడం తప్పనిసరి, లేదంటే లేదు.ఇందుకు మీరు సారధ్యం వహిస్తానని మాట ఇస్తేనే.మీరు ఇందుకు ఒప్పుకుంటే బ్లాంక్ చెక్కును పంపుతున్నాను స్వీకరించండి.అంటూ లేఖ రాశారట రామోజీరావు.
అయితే లెటర్ ను చదివిన ఆరుద్ర గారు సున్నితంగా తిరస్కరిస్తూ తిరిగి మరొక లేఖను రామోజీ రావు గారికి సవినయంగా రాశారట.నేను కిడ్నీల సమస్యతో ఆస్పత్రిలో చేరి ఇబ్బంది పడుతున్న సమయంలో మాగుంట సుబ్బరామిరెడ్డి గారు నాకు అండగా నిలిచారు, ఎంతగానో సహాయం చేశారు.ఆయన వీక్లీ పత్రికను పెట్టే ఆలోచనలో ఉన్నారని ఈ మధ్యే తెలిసింది.అయితే సాయానికి కృతజ్ఞత చెప్పాల్సిన సమయం ఇది అందుకే ఆ వీక్లీకి పనిచేస్తానని ఇప్పటికే మాట ఇచ్చాను.
ఒకేసారి రెండు తాటి పై నడవలేను అన్నట్లుగా ఇప్పుడయితే మీరు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక పోతున్నందుకు చింతిస్తున్నాను అంటూ రాసి దానితో పాటుగా రామోజీ రావు గారు పంపిన బ్లాంక్ చెక్ ను కూడా ఆ లేఖతో పాటుగా తిరిగి పంపారట ఆరుద్ర.అలా రామోజీ రావు నుండి వచ్చిన బ్లాంక్ చెక్ ను సున్నితంగా తిరస్కరించి తిరిగి వెనక్కి పంపారట గొప్ప రచయిత ఆరుద్ర గారు.