ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్కు అరుదైన అవార్డ్ లభించింది.అమెరికాలోని ప్రతిష్టాత్మక జాతీయ మానవహక్కుల మ్యూజియం ఆయనను ‘‘ఎమిసరీ ఆఫ్ పీస్’’ (శాంతి దూత) పురస్కారంతో సత్కరించింది.
ఐ స్టాండ్ ఫర్ పీస్ కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో పర్యటిస్తున్న రవిశంకర్.ఈ అవార్డును అందుకున్నారు.
ప్రపంచవ్యాప్తంగా 150కి పైగా దేశాలలో సుదర్శన క్రియ, యోగా, ధ్యానం, ప్రాణాయామం ద్వారా కోట్లాది మందికి ఆయన ఆరోగ్యాన్ని, ఆనందాన్ని అందిస్తున్నారని ఈ సందర్భంగా నిర్వాహకులు కొనియాడారు.అలాగే జాతులు, దేశాల మధ్య సంఘర్షణలను నివారించేందుకు రవిశంకర్ కృషి చేస్తున్నారని ప్రశంసించారు.
కాగా, 1981వ సంవత్సరంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థను స్థాపించారు రవిశంకర్.ఇది ప్రస్తుతం విద్య, మానవసేవా రంగాలలో 152కు దేశాలలో తన కార్యకలాపాలు సాగిస్తోంది.ఐక్యరాజ్య సమితిలోని ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ లో ప్రత్యేక సలహా, సంప్రదింపుల సంస్థగా గుర్తింపు తెచ్చుకుంది.వ్యక్తులలో, సమాజంలో, దేశాల మధ్యా తలెత్తే సంఘర్షణల నివారణకు దీర్ఘకాలిక పరిష్కారాలను కనుగొనటం, వాటిని ఆచరింప జేయటమే లక్ష్యంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ పనిచేస్తున్నది.
ప్రజలతో నేరుగా మమేకమవ్వడం, బహిరంగ కార్యక్రమాలు, బోధనలు, మానవసేవా కార్యకమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల ప్రజలకు రవిశంకర్ చేరువయ్యారు.ఈ క్రమంలో ఆయనను అనేక అవార్డులు వరించాయి.ఆర్డర్ ఆఫ్ పోల్ స్టార్ (మంగోలియా దేశపు అత్యున్నత అవార్డు), రష్యా ప్రభుత్వంచే ది పీటర్ ది గ్రేట్ అవార్డ్, సంత్ శ్రీ ధ్యానేశ్వర్ ప్రపంచ శాంతి బహుమతి (భారత్), గ్లోబల్ హ్యుమానిటేరియన్ అవార్డ్ (అమెరికా) మొదలైనవి.ఇవికాకుండా ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో 2000వ సంవత్సరంలో నిర్వహించిన మిలీనియం ప్రపంచ శాంతి శిఖరాగ్రసభ, 2001, 2003 సంవత్సరాలలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సభలలోనూ, అనేక దేశాల పార్లమెంటులలోనూ రవిశంకర్ ప్రసంగించారు.