ఆర్ధిక ఇబ్బందులు కావొచ్చు.కుటుంబాన్ని ఇంకా బాగా చూసుకునే ఆలోచన కావొచ్చు.
ఏదైతేనేం.భారతీయులు ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకుని విదేశాలకు వెళ్తున్నారు.
కానీ అక్కడ అడుగుపెడితే కానీ అసలు విషయం తెలియదు.అవసరంలో వున్నవారిని ఆదుకుంటామని చెప్పి టూరిస్ట్ వీసా పేరిట వారిని ట్రావెల్ ఏజెంట్లు తరలించే పద్ధతి ఇప్పటికీ కొనసాగుతోంది.
గడువు ముగిసిన తర్వాత వీరు అక్కడే ఉండిపోతున్నారు.అక్కడి చట్టాలు కఠినంగా ఉండటంతో వీసాలు, పాస్పోర్టులు లేనివారు రహస్యంగా జీవిస్తున్నారు.
భారతీయ కార్మికుల భయం, బలహీనతలను ఆసరాగా తీసుకొని యజమానులు, ట్రావెల్ ఏజెంట్లు వారిని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు.ఇంకొందరైతే విదేశాలకు వెళ్లే క్రమంలో పోలీసులకు దొరికిపోయి.
జైల్లో గడుపుతున్నారు.కనీసం వీరి క్షేమ సమాచారం కూడా కుటుంబ సభ్యులకు తెలియడం లేదు.
తాజాగా ట్రావెల్ ఏజెంట్ చేతిలో మోసపోయి టర్కీలో అరెస్ట్ అయిన 17 మంది భారతీయ యువకులు ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్నారు.వీరంతా పంజాబ్ రాష్ట్రానికి చెందినవారే.యూరప్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి.ఓ ట్రావెల్ ఏజెంట్ వారిని మోసం చేశాడు.
తొలుత వారిని దుబాయ్కి అక్కడి నుంచి సెర్బియాకు తీసుకెళ్లాడు.గ్రీస్- టర్కీ సరిహద్దు వద్ద వారి పాస్పోర్టులను తీసుకుని పత్తా లేకుండా పోయాడు.
ఆ సమయంలో అనుమానాస్పదంగా కనిపించడంతో వీరిని టర్కీ పోలీసులు అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు.
ఉద్యోగం కోసం వెళ్లిన తమ కుమారుల జాడ తెలియరాకపోవడంతో బాధిత కుటుంబాలు పంజాబ్కు చెందిన రాజ్యసభ ఎంపీ విక్రమ్ జిత్ సింగ్ సాహ్నీతో అక్టోబర్ 23న తమ గోడు వెళ్లబోసుకున్నాయి.దీనిపై స్పందించిన ఆయన వెంటనే విదేశాంగ శాఖతో పాటు టర్కీలోని భారత రాయబార కార్యాలయ అధికారులతో సంప్రదింపులు జరిపారు.రంగంలోకి దిగిన దౌత్య సిబ్బంది యువకులను విడిపించి.
వారికి తాత్కాలిక ట్రావెల్ పర్మిట్లు జారీ చేసి క్షేమంగా భారతదేశానికి పంపారు.