ఈశాన్య రాష్ర్టమైన త్రిపురలో శని వదిలిపోయింది.ఈ రాష్ర్టంలో శని ఏమిటనుకుంటున్నారా? ఇక్కడ పందొమ్మిదివందల తొంభైఏడో సంవత్సరం నుంచి అమల్లో ఉన్న రాక్షస చట్టం సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని (ఎఎఫ్ఎస్పిఎ) ఎత్తేయాలని త్రిపుర సర్కారు నిర్ణయించింది.కల్లోలిత ప్రాంతాల్లో సాయుధ దళాలకు ప్రత్యేక అధికారాలను కట్టబెట్టి అవి తమ ఇష్టానుసారంగా వ్యవహరించే వీలున్న వివాదాస్పద చట్టాన్ని పారదోలాలని మాణిక్ సర్కార్ ప్రభుత్వం నిర్ణయించుకుంది.హోం శాఖ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ వివాదాస్పద చట్టాన్ని ఎత్తేయాలని కేబినెట్ సమావేశం నిర్ణయించినట్లు తెలిపారు.
రాష్ర్టంలోని కల్లోలిత ప్రాంతాల పరిస్థితిపై తాము ప్రతి ఆరు నెలలకు సమీక్ష చేశామని, పోలీసు, భద్రతా సంస్థల అధికారులతో చర్చలు జరిపామని, ఈ చట్టం ఇక అవసరం లేదని వారు ప్ర భుత్వానికి తెలియచేశారని చెప్పారు.ఈ చట్టం ద్వారా సైన్యానికి అపరిమితమైన అధికారాలు దక్కుతాయి.
దాని చర్యలను ఎవరూ ప్రశ్నించేందుకు అవకాశం లేదు.సైన్యం ఎవరినైనా కాల్చి చంపొచ్చు, అరెస్టు చేయవచ్చు, అదుపులోకి తీసుకోవచ్చు.
ఎటువంటి వారెంటు లేకుండానే విద్రోహశక్తుల పేరుతో ఎవరిమీదనైనా చర్యలు తీసుకోవచ్చు.జమ్మూ కశ్మీర్ సహా మరో నాలుగు ఈశాన్య రాష్ర్టాల్లోనూ ఈ చట్టం అమల్లో ఉంది.
ఈ చట్టాన్ని ఎత్తేయాలని డిమాండ్ చేస్తూ సామాజిక కార్యకర్త, మణిపూర్కు చెందిన ఇరోమ్ షర్మిల గత పదిహేను సంవత్సరాలుగా నిరాహార దీక్ష చేస్తోంది.ఉగ్రవాదాన్ని, చొరబాట్లను నివారించేందుకు అమలు చేసిన సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టం సైన్యం చేతుల్లో దుర్వినియోగమవుతోందని పౌర హక్కుల, మానవ హక్కుల నాయకులు ఆందోళన చెందుతున్నారు.