బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ రక్షణ వ్యవస్థని బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టిపెట్టింది.ఇందులో భాగంగా రక్షణ వ్యవస్థకి ఎక్కువ నిధులు కేటాయిస్తూ వస్తుంది.
అందుకు తగ్గట్లుగానే ఆయుధాలు సమకూర్చుకోవడంతో పాటు శత్రు దేశాల కవ్వింపు చర్యలకి గట్టిగా సమాధానం చెప్పడం సాధ్యం అవుతుంది.ఒక విధంగా చెప్పాలంటే ప్రస్తుతం ఇండియన్ రక్షణ వ్యవస్థ చాలా బలంగా ఉంది.
ఒకప్పుడు పాకిస్తాన్ నుంచి చొరబాట్లు ఎక్కువగా ఉండేవి, ఉగ్రవాదులు దేశంలోకి వచ్చి దాడులకి పాల్పడేవారు.ఇప్పుడు సరిహద్దులోనే వారిని తుదముట్టిస్తున్నారు.
దేశంలో అడుగుపెట్టే అవకాశమే ఇవ్వడం లేదు.అలాగే వారి సైనిక చర్యలకి కూడా దీటుగా సమాధానం చెబుతున్నారు.
ఇక ఇప్పుడు చైనా సరిహద్దు ప్రాంతాలలో కూడా గాల్వాన్ వ్యాలీ ఘటన తర్వాత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం సైనికులకి మరింత స్వేచ్చ ఇస్తుంది.
కేంద్ర ప్రభుత్వం అనూహ్య నిర్ణయాలతో సైన్యంకి కొండంత భరోసా ఇస్తుంది. సైన్యానికి సొంతంగా నిర్ణయాలను తీసుకునే వెసులుబాటును కల్పిస్తోంది.
తాజాగా 300 కోట్ల వరకు ఆయుధ సామగ్రిని కొనుగోలు చేసే అధికారాన్ని సైన్యానికి కేంద్ర ప్రభుత్వం కట్టబెట్టింది.దీంతో ఇకపై 300 కోట్ల వరకు జరిపే కొనుగోళ్లకు అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉండదు.
రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలో రక్షణ కొనుగోళ్ల మండలి సమావేశం జరిగింది.ఈ సమావేశంలో దీనికి సంబందించిన కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు.
అత్యవసరమైన ఆయుధాలను కొనుగోలు చేసే అధికారాన్ని సైన్యానికి డీఏసీ బదిలీ చేసింది.సైన్యాన్ని మరింత పటిష్టం చేసే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో సైన్యానికి మరింత స్వేచ్చ లభించింది.శత్రు సైన్యాన్ని ఎదుర్కోవడానికి సకాలంలో ఆయుధ సామగ్రిని సమకూర్చుకునే సౌలభ్యం దొరికింది.
.