కుల్ఫీలు అమ్ముకుంటున్న అర్జున్ అవార్డ్ గ్రహీత !
అతడు భారత రాష్ట్రపతి చే అర్జున్ అవార్డ్ అందుకున్నాడు.అయితేనేం ప్రస్తుతం కుల్ఫీలు అమ్ముకునే పరిస్థితికి వచ్చాడు.
కలం కలిసి రాకపోతే జీవితం తలకిందులు అవుతుంది అనే దానికి ఇతడు ఉదాహరణగా నిలుస్తున్నాడు.హరియాణాకు చెందిన దినేష్ బాక్సర్గా అనేక జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధించాడు.మొత్తం 17 స్వర్ణ, 1 రజత, 5 కాంస్య పతకాలు నెగ్గాడు.2009లో అప్పటి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ చేతుల మీదుగా అర్జున అవార్డు కూడా అందుకున్నాడు.2010 ఆసియా క్రీడల్లో రజత పతకంతో మెరిశాడు.కానీ, దేశం తరఫున పతకాలు కొల్లగొడుతూ ఓ వెలుగు వెలగాల్సిన అతడి జీవితాన్ని రోడ్డు ప్రమాదం తలకిందులు చేసింది.2014 కామన్వెల్త్ క్రీడలకు ముందు ట్రైనింగ్ క్యాంపుకు వెళ్తుండగా అతడు ప్రయాణిస్తున్న కారు లారీని ఢీకొనడంతో దినేష్ తీవ్రంగా గాయపడ్డాడు.ఈ ప్రమాదంలో అతడి కుడి చేతి ఎముక రెండుచోట్ల విరగడంతో శస్త్ర చికిత్స చేయాల్సి వచ్చింది.
దీంతో బాక్సింగ్కు దూరమయ్యాడు.
కొడుకు కోసం అప్పు చేసి మరీ వైద్యం చేయించాడు దినేష్ తండ్రి.అప్పటికే కొడుకు విదేశాల్లో ఆడేందుకు వెళ్ళటానికి చేసిన అప్పుకుతోడు వైద్యానికి చేసిన అప్పులు కూడా తోడవ్వడంతో వడ్డీలు అంతకంతకూ పెరిగిపోతూ వచ్చాయి.తండ్రి తనకోసం చేసిన అప్పులు తీర్చడానికి దినేష్ కూడా ఆయనతోపాటు కుల్ఫీలు అమ్మడానికి రోడ్లపైకి వచ్చాడు.
ప్రభుత్వ పరంగా ఎటువంటి సాయం అందకపోవడంతో కుల్ఫీలు అమ్మాల్సి వస్తోందని దినేష్ ఆవేదన వ్యక్తం చేశాడు.‘నన్ను అంతర్జాతీయ టోర్నీలకు పంపడానికి నా తండ్రి అప్పులు చేశాడు.
అప్పులు తీర్చడానికి ప్రభుత్వం సహాయం చేయాల’ని దినేష్ విజ్ఞప్తి చేశాడు.తనకు ఉద్యోగమిచ్చి తన జీవితానికి భరోసా కల్పించాలని అతడు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు.