మహిళల అక్రమ రవాణా కేసులో ఆరిజోనా రాష్ట్రానికి చెందిన అధికారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.పాల్ పిటర్సన్ అనే వ్యక్తి అడాప్షన్ లాయర్గా, మారికోపా కౌంటీ అసెస్సర్గా పనిచేస్తున్నాడు.
ఇతను మరికొందరితో కలిసి ముఠాగా ఏర్పడ్డాడు.అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అమల్లో దత్తత పథకాన్ని అవకాశంగా తీసుకుని వీరు మార్షల్ దీవుల్లోని గర్భవతులైన మహిళలకు డబ్బు ఆశ చూపించి యూఎస్లోకి అక్రమంగా తరలించాడు.
ఈ మహిళలు పుట్టబోయే బిడ్డలను ఉటాహలో దత్తత ఇవ్వాలని ముఠా ముందుగానే ఒప్పందం చేసుకునేది.ఈ క్రమంలో 2017 అక్టోబర్లో మానవ అక్రమణ రవాణాపై అధికారులు ఫోకస్ పెట్టారు.ప్రధానంగా సాల్ట్ లేక్ సిటీ ప్రాంతంలోని ఆసుపత్రుల్లో మార్షల్ దీవులకు చెందిన గర్భవతులు పెద్ద సంఖ్యలో వచ్చి చేరడం, పుట్టిన బిడ్డలను దత్తతకు ఇవ్వడం అధికారులకు అనుమానం కలిగించింది.2018 డిసెంబర్లో ఓ వ్యక్తి ఈ ముఠా నుంచి బిడ్డను దత్తత తీసుకునేందుకు ఒప్పందం చేసుకున్నాడు.అయితే వీరి ప్రవర్తన అనుమానాస్పదంగా తోచడంతో ఆరిజోనా పబ్లిక్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అధికారులకు ఫిర్యాదు చేశారు.
దీనిపై దర్యాప్తు ముమ్మరం చేసిన అధికారులకు తీగ లాగితే మొత్తం బండారం వెలుగులోకి వచ్చింది.ఈ ముఠాకు నాయకుడు పాల్ పీటర్సన్గా తేలింది.క్రిస్టియన్ మిషనరీ వాలంటీర్గా మార్షల్ ఐలాండ్స్లో పనిచేసిన పాల్ అక్కడి ప్రజల పేదరికం, ఆర్ధిక అవసరాలను ఆసరగా తీసుకుని ఈ కుట్రకు తెరదీశాడు.
దీని ప్రకారం గర్భవతులైన మహిళలకు పదివేల డాలర్లు ఇచ్చేవాడు.అయితే అమెరికా వెళ్లేందుకు, ఆసుపత్రి, ఇతర ఖర్చులను మాత్రం పీటర్సనే భరించేవాడు.
డెలీవరి తర్వాత పిల్లలను 25 వేల డాలర్ల నుంచి 40 వేల డాలర్లకు విక్రయించేవాడు.ఆ విధంగా రెండేళ్లలో 2.7 మిలియన్ డాలర్లను పాల్ పీటర్సన్ కూడబెట్టినట్లుగా ఉటాహ రాష్ట్ర అటార్నీ జనరల్ సీన్ రీస్ వెల్లడించారు.ఇతనిపై దోపిడి, మోసం, ఫోర్జరీ, మానవ అక్రమ రవాణా, శిశువుల విక్రయం తదితర వ్యవహారాల కింద మొత్తం 32 కేసులు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు.
వీటిపై అతనిని ఈ నెల 15న కోర్టు ముందు హాజరుపరచనున్నారు
.