ఇప్పుడు ఎక్కడ ఏ హాస్పిటల్ చూసినా జనాలతో కిటకిటలాడుతున్నాయి.రకరకాల జబ్బులతో నిత్యం హాస్పిటల్ చుట్టూ తిరిగేవారి సంఖ్య ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది.
దీనికి సగం ఆహార పదార్ధాల కల్తీ కారణం అయితే మిగతా సగం కాలుష్యం.ఆహార పదార్థాల కల్తీ ప్రజారోగ్యానికి పెనుసవాల్ విసురుతోంది.
యూరియాతో పాలు, జంతుకళేబరాల తో వంట నూనెలు, అరటి బొందుతో అల్లంవెల్లుల్లి పేస్టు, కారంలో రంపపుపొడి, గసగసాల్లో ఉప్మారవ్వ, కందిపప్పులో కేసరిపప్పు, మిరియాల్లో బొప్పాయి గింజలు, ఆవాల్లో బ్రహ్మజెముడు గింజలు, గోధుమపిండిలో గంజిపొడి వంటివి కలిపి ఆహార పదార్థాల్ని కల్తీమయం చేస్తున్నారు.
ఆకుకూరలు, కూరగాయలతో పాటు నిగనిగలాడుతూ నోరూరించే పండ్లు సైతం విషతుల్యమవుతున్నాయి.
మార్కెట్కు ప్రతిరోజు దేశ, విదేశాలకు చెందిన ఎన్నో రకాల పండ్లు దిగుమతి అవుతుంటాయి.అయితే, వాటిని మగ్గించేందుకు ఇక్కడి వ్యాపారులు రసాయనాలు వినియోగిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.
ప్రధాన పండ్ల మార్కెట్లు, బహిరంగ మార్కెట్లలో విక్రయిస్తున్న వివిధ రకాల పండ్లను చైనా పౌడర్, ఇతర రసాయనాలతో కృత్రిమంగా మగ్గబెడుతున్నారని, దాంతో ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతోందని ‘ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా’ తాజా అధ్యయనంలో గుర్తించింది.
కాయలను మగ్గించేందుకు చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నరసాయన పౌడర్తో పాటు ఎసిటలిన్ గ్యాస్, కార్బైడ్ వంటి పదార్థాలు వాడుతున్నారని తేల్చింది.ఈ పండ్లలో ఆర్సినిక్, ఫాస్పరస్ వంటి మూలకాల ఆనవాళ్లున్నట్లు ప్రకటించింది.ఈ రసాయనాలున్న పండ్లు తిన్నవారికి మెదడు, నరాలు, జీర్ణవ్యవస్థ, మూత్రపిండాలు దెబ్బతినడంతో పాటు, చర్మవ్యాధులు, కడుపులో మంట వంటి సమస్యలతో బాధపడతారని హెచ్చరించింది.
హానికారక రసాయనాలు, మూలకాలున్న చైనా పౌడర్ను చెన్నై, ముంబై పోర్టుల నుంచి నేరుగా పలువురు దళారులు, వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారు.దీన్ని పండ్ల వ్యాపారులకు విక్రయిస్తున్నట్లు ఇటీవల ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ సంస్థ దాడుల్లో బయటపడింది.
ఐపీఎం అధికారుల దాడులతో అప్రమత్తమవుతోన్న వ్యాపారులు గోడౌన్ల బయట కొన్ని పండ్లను నిబంధనల ప్రకారం మగ్గబెట్టి రసాయనాల ఆనవాళ్లు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.అయితే గోడౌన్ లోపల భారీగా నిల్వ ఉంచిన పండ్లను మాత్రం రసాయనాలతో పండిస్తున్నారు.
కొనే ముందు పరిశీలించాలి.* మార్కెట్లో కొనుగోలు చేసే పండ్లపై అధిక సంఖ్యలో నల్లటి మచ్చలుంటే వాటిపై రసాయనాల ఆనవాళ్లున్నట్లు గుర్తించాలి.
* యాపిల్, ఆరెంజ్, దానిమ్మ వంటి పండ్లు బాగా నిగనిగలాడుతుంటే వాటిపై రసాయనాల పూత ఉన్నట్టు.* పండ్లను తినేముందు బాగా కడిగి తినాలి.
* సహజసిద్ధంగా పక్వానికి వచ్చే పండ్లను తింటేనే ఆరోగ్యానికి మంచిదని, ఆయా పండ్లలో ఆవశ్యక పోషకాలుంటాయని గుర్తించాలి.