ఏపీలో రాజకీయ పరిస్థితులను పూర్తిగా తమకు అనుకూలంగా మార్చుకుని ప్రజలకు మరింత దగ్గర కావాలి అనే ప్లాన్ తో ఉన్నారు వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్.2024 ఎన్నికల్లో మళ్ళీ వైసిపి గుర్తుపైనే జనాలు ఓటు వేసే విధంగా చేసేందుకు ఆయన గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు.రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, అప్పులు తెచ్చి మరి సంక్షేమ పథకాలను నడిపిస్తున్నారు.ఈ విషయంలో ఎన్ని విమర్శలు వ్యక్తం అయినా, జగన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.జనాల్లో కి సంక్షేమ పథకాలను తీసుకెళ్లడం ద్వారా వారు వైసీపీని మళ్లీ గెలిపిస్తారని నమ్ముతున్నారు.
అయితే ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజలు అసంతృప్తి ఉన్న విషయాన్ని ఆయన మర్చిపోలేదు. అందుకే గడపగడపకు మన ప్రభుత్వం పేరుతో పార్టీ ఎమ్మెల్యేలను, అధికారులను ఇతర కీలక నాయకులను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేశారు.
దీని ద్వారా ప్రజా వ్యతిరేకతను తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు .ఇక చాలామంది మంత్రుల పనితీరు అంతంత మాత్రమే అన్నట్టుగా ఉంది.పార్టీకి ప్రభుత్వానికి వారి వల్ల కలిసి వచ్చే పరిస్థితులు లేకపోవడం, ప్రత్యర్థులు ఘాటు పదజాలంతో పార్టీ పైన, వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నా, చాలామంది మంత్రులు మౌనంగా ఉండి పోవడం, అలాగే తమ శాఖల పైన పట్టు సాధించలేకపోవడం వంటి విషయాలను జగన్ సీరియస్ గా తీసుకున్నారు. అటువంటి వారిని మంత్రులుగా కొనసాగించినా, పార్టీకి ప్రభుత్వానికి పెద్దగా కలిసి వచ్చేది ఏమీ ఉండదనే విషయాన్ని గుర్తించారు.
అందుకే నవంబర్ లో కొంతమంది మంత్రులను తప్పించి కీలకమైన వాక్చాతుర్యం వారికి మంత్రి పదవులు కట్టబెట్టాలని నిర్ణయం తీసుకున్నారట.అంతేకాదు ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకుని ప్రజల్లో గ్రాఫ్ పెంచుకోవాలని, పూర్తిగా తనపైన , పార్టీ పైన భారం వేసి ఎన్నికలకు వెళ్తామంటే అటువంటి వ్యవహారాలు తన వద్ద కుదరదని, వారికి టికెట్ ఇచ్చేదే లేదు అంటూ తేల్చి చెప్పేసారు.జగన్ ఇంత ఘాటుగా వ్యాఖ్యలు చేయడం వెనుక కారణాలు చాలానే ఉన్నాయి.మెతక వైఖరితో ఇప్పటి నుంచే అలసత్వం వహిస్తే ఎమ్మెల్యేలు, మంత్రులు మరింత అలసత్వం తో వ్యవహరిస్తారని, ప్రజల్లోకి వెళ్ళకుండా సొంత వ్యాపారాలపై దృష్టి పెడతారని , అందుకే టికెట్ విషయంలో కఠినంగానే వ్యవహరించబోతున్నాము అనే సంకేతాలను ఇవ్వడం ద్వారా వారి పరిస్థితిలో మార్పు వస్తుందని భావిస్తుండడంతోనే ఈ విధంగా పార్టీ సమావేశాల్లో కఠినంగా మాట్లాడుతున్నారట.
.