తెలంగాణ రాజకీయాల్లో ఈటెల రాజేందర్ వ్యవహారం ఒక్కసారిగా కలకలం రేపింది.టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్ తో పాటు, తెలంగాణ సాధించడంతో పాటు, టీఆర్ఎస్ ను రెండుసార్లు అధికారంలోకి తీసుకు రావడానికి తన వంతు సహకారం అందించిన నేతల్లో రాజేందర్ ముందు వరసలో ఉంటారు.
కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా మొదట్లో ముద్ర వేయించుకున్న ఈటెల రాజేందర్, రెండోసారి టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రాధాన్యం కోల్పోయినట్లుగా కనిపించారు.దీనంతటికీ కారణం అధినేత కెసిఆర్ తో రాజేందర్ కు దూరం పెరగడమే కారణమట.
అసలు టిఆర్ఎస్ ఆవిర్భావం లో తమ పాత్ర ఉందని రాజేందర్ ప్రచారం చేసుకోవడం, మొదటి నుంచి తాను టీఆర్ఎస్ లో అగ్ర నాయకుడిని అనే విధంగా రాజేందర్ ఉండడం వంటి వ్యవహారాలు కేసీఆర్, కేటీఆర్ కు ఇబ్బందికరంగానే మారుతూ వచ్చాయట.
అసలు రెండోసారి గెలిచిన తర్వాత ఈటెల రాజేందర్ కు మంత్రి పదవి ఇవ్వకూడదని కేసీఆర్ భావించినా, తప్పనిసరి పరిస్థితుల్లో ఆయనకు మంత్రి పదవి దక్కింది.
ఆ తర్వాత పరిణామాలో కేటీఆర్ బహిరంగంగానే ఈటెల పై విమర్శలు చేశారు.ఇప్పుడు అకస్మాత్తుగా ఈటెల రాజేందర్ భూకబ్జాలు అంటూ పెద్ద ఎత్తున అన్ని మీడియాల్లోనూ ప్రచారం కావడం వెనుక టిఆర్ఎస్ పెద్దలు ఉన్నారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ముఖ్యంగా కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడైన ఓ యువనేత దీని వెనుక ఉన్నారని, బాధితుల వాదన ప్రచారం చేయడంతో పాటు, ఈటెల రాజేందర్ కబ్జా దారుడు అనే ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చేందుకు గట్టిగానే కృషి చేసినట్లు తెలుస్తోంది.
త్వరలోనే కెసిఆర్ తన మంత్రిమండలిని విస్తరించాలని చూస్తున్నారు.తప్పనిసరిగా అందులో ఈటెలను తప్పిస్తారు అని , ఆయనతో పాటు గంగుల కమలాకర్ , మంత్రి మల్లారెడ్డి వంటి వారిని తప్పించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.ఈటెల రాజేందర్ వ్యవహారంతో పార్టీలోనూ, మంత్రివర్గంలోనూ పూర్తిగా ప్రక్షాళన చేపడతారని, పార్టీ లో ఉంటూ, అసంతృప్తితో పార్టీకి చేటు చేస్తున్నవారు విషయంలో కేసీఆర్ ఉపేక్షించేది లేదని, త్వరలోనే అటువంటి వారందరినీ తప్పించి పూర్తిగా పార్టీని, క్యాబినెట్ ను ప్రక్షాళన చేయబోతున్నారని ప్రచారం ఊపందుకుంది.
ఈటెల వ్యవహారంలో ఇంత దూకుడుగా వ్యవహరించడనికి కారణం, మరెవరైనా ఇటువంటి తరహా చర్యలకు పాల్పడితే పరిణామాలు ఈ విధంగా ఉంటాయి అనేది చూపించేందుకే ఇంత సీరియస్ యాక్షన్ లోకి దిగినట్టు గా కనిపిస్తున్నారు.