వ్యాపార రంగంలో భారతదేశ ఖ్యాతిని రెపరెపలాడించడంతో పాటు ప్రపంచంలోనే అతిపెద్ద ఉక్కు కంపెనీ ఆర్సెల్లర్ మిట్టల్ అధిపతిగా వున్న భారత సంతతి వ్యాపార వేత్త లక్ష్మీ నివాస్ మిట్టల్ కంపెనీ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నారు.ఆర్సెలర్ మిట్టల్ నూతన ఛైర్మన్, సీఈఓగా ఆదిత్య మిత్తల్ను ప్రకటించారు.
లక్ష్మీ మిట్టల్ సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా కొనసాగుతారు. లక్సెంబర్గ్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఆర్సెల్లర్ మిట్టల్ 60 దేశాల్లో స్టీలు, మైనింగ్ కార్యకలాపాలతో దూసుకుపోతోంది.అంతేకాకుండా పదిహేడు దేశాల్లో ఉక్కు నిర్మాణ రంగంలో ఉంది.2006లో ఆర్సెలర్ సంస్థలో మిట్టల్ స్టీల్ విలీనమై ఆర్సెలర్ మిట్టల్గా అవతరించింది.ఇక ఆదిత్య మిట్టల్ విషయానికి వస్తే.ఆయన ప్రస్తుతం ఆర్సెలర్ మిట్టల్ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ)గా వ్యవహరిస్తున్నారు.ఈయనను సంస్థ సీఈఓ పదవికి ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు డైరెక్టర్ల బోర్డు ప్రకటించింది.46 ఏళ్ల ఆదిత్య 1997లో ఆర్సెలర్ మిట్టల్లో చేరారు.అంతకు ముందు ఆయన క్రెడిట్ సుజీ అనే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సంస్థలో పనిచేశారు.
రాజస్థాన్ లోని సదల్పూర్ లో 1950 జూన్ 15న మోహల్ లాల్ మిట్టల్ దంపతులకు జన్మించిన లక్ష్మీ నివాస్ మిట్టల్, ఆ దంపతుల ముగ్గురు సంతానంలో ఒకడిగా కుటుంబంతో పాటు కోల్ కతా వలస వెళ్లారు.ప్రతిష్టాత్మక సెయింట్ జేవియర్ కళాశాలలో కామర్స్ విభాగంలో డిగ్రీ పట్టా సాధించిన అనంతరం తండ్రికి వ్యాపారంలో చేదోడువాదోడుగా వున్నారు మిట్టల్. 1994 దాకా ఉమ్మడి కుటుంబంగానే కొనసాగిన మోహన్ లాల్ ముగ్గురు కొడుకులు… ఆ తర్వాత విడిపోవాలని నిర్ణయించుకుని వాటాలు పంచుకున్నారు.దీంతో విదేశాల్లోని కంపెనీలు మిట్టల్ కు దక్కాయి.‘ఇస్పాత్ ఇంటర్నేషనల్’ పేరిట పేరు మార్చిన మిట్టల్ వ్యాపార విస్తరణలో మరింత వేగం పెంచారు.ఆ తర్వాత 2004లో ‘ఎల్ఎన్ఎం హోల్డింగ్స్’ పేరిట ఏర్పాటు చేసిన కంపెనీని ఇస్పాత్ ఇంటర్నేషనల్ లో విలీనం చేసి ‘మిట్టల్ స్టీల్’ గా పేరు మార్చారు.అప్పటికే ఇస్పాత్ ఇంటర్నేషనల్, ఓహియో కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఇంటర్నేషనల్ స్టీల్ గ్రూపు ఇంక్ (ఐఎస్ జీఐ)ని తనలో విలీనం చేసుకుంది.
అప్పటికే పలు దేశాల్లో నష్టాల్లోని కంపెనీలను కొనుగోలు చేస్తూ వెళ్లిన మిట్టల్, ఐఎస్ జీఐ విలీనంతో 14 దేశాలకు తన కార్యకలాపాలను విస్తరించినట్లైంది.
ఇక 2006లో ఆర్సెలర్ కొనుగోలుతో మిట్టల్… ప్రపంచంలోనే 100 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఉక్కు ఉత్పత్తి రంగంలో అగ్రస్థానంలో నిలిచి ‘ఉక్కు మనిషి’గా ఖ్యాతిగాంచారు.
అదే సమయంలో ప్రపంచంలోని కుబేరుల జాబితాలోనూ చోటు దక్కించుకున్నారు.