ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో భాగంగా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకునే వెళ్తున్నారు.అదే సమయంలో నవరత్నాలను కూడా అమలు చేస్తూ ప్రజా సంక్షేమం కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నారు.
కొన్ని విషయాల్లో విపక్షాల నుంచి జగన్ కి అడ్డంకులు ఎదురవుతున్న కూడా తన పంతాలో ఎలాంటి మార్పు లేకుండా హామీలను అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు.మరోవైపు ఇప్పటివరకు లేనివిధంగా ఏపీలో కీలక బిల్లులను ప్రవేశపెడుతూ తమకున్న బలంతో అసెంబ్లీలో ఆమోదింపచేస్తూ వాటిని ఆచరణలో తీసుకొస్తున్నారు.
ఇప్పటికే దిశ చట్టంతో దేశవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి పేరు మార్మోగిపోతోంది.ఇదిలా ఉంటే తాజాగా ఈరోజు ఏపీ అసెంబ్లీలో మరో కీలక బిల్లులకు ఆమోదం తెలిపారు.
పాదయాత్రలో భాగంగా ఏపీ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని ఇచ్చిన హామీని నెరవేర్చే విధంగా ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేస్తూ రూపొందించిన బిల్లును అసెంబ్లీ ఆమోదించింది.మొన్నటి వరకు తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగులు తమని ప్రభుత్వంలో విలీనం చేయాలని తీవ్రస్థాయిలో ఆందోళన చేసిన సంగతి అందరికీ తెలిసిందే.
అయితే కేసీఆర్ ప్రభుత్వం ఆర్టీసి విలీనం చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారు.ఇదిలా ఉంటే ప్రస్తుతం లోటు బడ్జెట్ తో, అప్పుల ఊబిలో ఉన్న ఏపీ ప్రభుత్వం మాత్రం దీనికి విరుద్ధంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసింది.
ఈ విలీన ప్రక్రియ ద్వారా ఆర్టీసీలో ప్రస్తుతం పని చేస్తున్న 52 వేల మంది ఉద్యోగులు ఇకపై ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు పొందుతారు.ఇక ప్రభుత్వ పరంగా వాళ్లకి అన్ని రకాల బెనిఫిట్స్ ని అందించడానికి ప్రభుత్వ సిద్ధమైనట్లు మంత్రి పేర్ని నాని అసెంబ్లీలో స్పష్టం చేశారు.
ఇక జనవరి ఒకటి నుంచి ఆర్టీసీ ఉద్యోగులు అందరు ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించబడతారు అని తెలియజేశారు.ఈ బిల్లు ఆమోదం నేపథ్యంలో ప్రస్తుత ఏపీలో ఆర్టీసీ ఉద్యోగులు అంతా ఒక్కసారిగా సంబరాలు చేసుకుంటున్నారు.
ఇక జగన్ కి కృతజ్ఞతగా పాలాభిషేకం కూడా చేయడం మొదలుపెట్టారు.