ప్రజల బతుకు చిత్రాన్ని కరోనా వైరస్ అతలాకుతలం చేసేసింది.ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ ప్రభావం ఉండడంతో పాటు, ఈ వైరస్ కు మందు ఇప్పటివరకు కొనుక్కో క పోవడంతో దీని ప్రభావం ముందు ముందు ఎంత తీవ్రంగా ఉండబోతుందనే ఆందోళన ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తోంది.
ఇప్పటికే అమెరికా, ఇటలీ, బ్రిటన్ వంటి దేశాలు ఈ వైరస్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి ఇక భారతదేశంలో దీని ప్రభావం అంత తీవ్రంగా లేకపోయినా, ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నిబంధనలు కేంద్ర ప్రభుత్వం విధించింది.మార్చి 25 వ తేదీ నుంచి ఏప్రిల్ 14వ తేదీ వరకు ఈ నిబంధన అమలులో ఉండటంతో ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయింది.
ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు.కేవలం ఉదయం సమయంలో ఓ రెండు మూడు గంటలు నిత్యావసరాలు కొనుగోలు చేసుకునేందుకు మాత్రమే అనుమతిస్తున్నారు.
దీంతో ఏప్రిల్ 14 తర్వాత లాక్ డౌన్ ఎత్తి వేస్తారని, అప్పుడు యధాస్థితికి వస్తుందని ప్రజలందరూ ఆశలు పెట్టుకున్నారు.అయితే రోజురోజుకు దీని ప్రభావం పెరిగిపోతుండటం, కొత్త కేసులు నమోదు కావడంతో కేంద్రం కూడా ఆందోళన చెందుతోంది.
ఏప్రిల్ 14వ తేదీ ఇంకా నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది.దీంతో కరోనా పాజిటివ్ కేసులు కంట్రోల్ కాకపోతే లాక్ డౌన్ విషయంలో ఏం చేయాలనే దానిపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తుంది.
కొన్ని రాష్ట్రాల్లో దీని ప్రభావం పెద్దగా లేకపోయినా, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో దీని ఉధృతి తీవ్రంగా ఉంది.ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు మరి కొంత మంది ముఖ్యమంత్రులు మరికొంత కాలం లాక్ డౌన్ పొడిగించాలంటూ సూచిస్తున్నారు.
అయితే దేశ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తున్న కేంద్రం మరికొంత కాలం కనుక పొడిగిస్తే దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకు పోతుందని, అప్పుడు పరిస్థితి చేయి దాటిపోతుందని ఆందోళనలో ఉంది.
ఈ దశలో ఒకవేళ లాక్ డౌన్ నిబంధనాలు ఎత్తివేస్తే కనుక ఆంక్షలు విధించాలని చూస్తోంది.కేవలం నిత్యవసర వస్తువులు, మెడికల్ షాప్ లు వంటివి మాత్రమే 15 తర్వాత అనుమతిఇవ్వాలని పర్యాటక ప్రదేశాలు సినిమా థియేటర్లు వంటివాటిని మరికొంతకాలం మూసివేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.అయితే ఈ విషయంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు నిర్ణయాలను వదిలి వేయాలని, కరోనా ప్రభావాన్ని బట్టి ఆయా రాష్ట్రాలే సొంతంగా ఆంక్షలు విధించేందుకు అవకాశం కల్పించాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
కేంద్రం ఆలోచిస్తున్న విధానాన్ని బట్టి చూస్తే ఏప్రిల్ 14 తర్వాత లాక్ డౌన్ నిబంధన ఎత్తివేసినా తీవ్రమైన ఆంక్షలు మాత్రం విధించే అవకాశం కనిపిస్తోంది.