తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది.ఏపీ ప్రభుత్వం గ్రామ, వార్డులను సచివాలయాల తరహాలో ఏర్పాటు చేసిన విధంగా తెలంగాణలో వార్డు ఆఫీస్ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయబోతుంది.
ఈ విషయంపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు శాసనమండలిలో స్పష్టతను ఇచ్చారు.
మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.
‘‘తెలంగాణ రాష్ట్రం మరో ముందడుగు వేసింది.త్వరలో రాష్ట్రంలో ఉన్న ప్రతి మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీస్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి వార్డు ఆఫీసర్ ను నియమించడం జరుగుతుంది.
వీరికి మొదటి మూడేళ్ల వరకు ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుందని, కార్పొరేటర్, వార్డు ఆఫీసర్ కలిసి పనిచేస్తారు.’’ అని మంత్రి పేర్కొన్నారు.
ఈ విధానాన్ని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అమలు చేసి విజయం సాధించిందన్నారు.వార్డు ఆఫీస్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడంతో ప్రజాసేవ మెరుగుపడటంతో పాటు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కూడా దొరుకుతాయన్నారు.
హైదరాబాద్ నగర అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, హైదరాబాద్ కార్పొరేషన్ కు ఎప్పటికప్పుడు నిధులు అందించడం జరుగుతుందన్నారు.జీహెచ్ఎంసీ పరిధిలో నివాసముంటున్న ప్రజలపై ఆస్తి పన్ను, నీటి పన్ను భారం మోపలేదని, పైగా మరి కొన్ని పన్నులకు తగ్గించామన్నారు.
శాసనమండలి సమావేశంలో హైదరాబాద్ అభివృద్ధిపై ప్రతిపక్ష నాయకులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ ఎంతో ఓపిగ్గా సమాధానం ఇచ్చారు.