కరోనావైరస్తో ప్రపంచదేశాలు వణికిపోతున్న విషయం తెలిసిందే.ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా ఈ వైరస్ తో చిగురుటాకులా వణికిపోతోంది.
ఏకంగా 10 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా లక్షల్లో మృతులు కూడా చోటుచేసుకోవడం గమనార్హం.అయితే రోజు రోజుకు అమెరికా లో పరిస్థితి మరీ దారుణంగా తయారవుతుండడం తో అత్యధిక కేసులతో అగ్రరాజ్యం కరోనా కేసుల్లో మొదటి స్థానంలో ఉంది.
అక్కడ ప్రతిరోజూ వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతుండడం తో టెక్ దిగ్గజ సంస్థ ఆపిల్ కీలక నిర్ణయం తీసుకుంది.రోజు రోజుకు కేసులు పెరుగుతున్న క్రమంలో ఫ్లోరిడా, అరిజోనా, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా ప్రాంతాల్లోని 11 స్టోర్లను మూసేయాలని ఆపిల్ సంస్థ నిర్ణయించింది.
మార్చి నెల నుంచి కరోనా మహమ్మారి విజృంభిస్తుండగా ప్రపంచవ్యాప్తంగా ఆపిల్ స్టోర్లన్నీ మూతపడ్డాయి.అయితే ఇటీవలే సేఫ్టీ గైడ్లైన్స్ పాటిస్తూ ఈ స్టోర్స్ ని ఓపెన్ చేసినప్పటికీ పెద్దగా కొనుగోళ్లు జరగడం లేదు.
ఈ నేపథ్యంలో ఆ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది.అమెరికాలో కరోనా తీవ్రత పెరుగుతుండటంతో ఆ 11 స్టోర్లను మూసేస్తున్నట్లు ఆ సంస్థ తాజాగా ప్రకటించింది.
అయితే ఇలా 11 స్టోర్స్ ను మూసివేయడం అనేది కేవలం తాత్కాలికమే అని, పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాక మళ్లీ ఆయా స్టోర్లు తెరుచుకుంటాయి అని ఆ సంస్థ స్పష్టం చేసింది.