దేశంలో నెలకొన్న కరోనా పరిస్థితులు రోజు రోజుకు దారుణంగా తయారవుతున్నాయి.అయినా కాని ఈ కరోనా గణాంకాలను ఏమాత్రం లెక్కచేయకుండా గత ఆరునెలలుగా మూతపడిన పాఠశాలలను తెరిచేందుకు ప్రభుత్వాలు కసరత్తులు చేస్తున్న విషయం విదితమే.
ఇప్పటికే ఏపీ ప్రభుత్వం సెప్టెంబర్ 5 నుంచి పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి అంటూ సీఎం ప్రకటించడం తో ఇటీవల స్కూల్ ఎడ్మిషన్స్ కూడా జరిగాయి.అయితే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాత్రం ఇప్పట్లో బడులు తెరిచే ఉద్దేశ్యమే లేదంటున్నారు.నగరంలో కరోనాకు సంబంధించి మెరుగైన పరిస్థితులు ఏర్పడినట్లు పూర్తిగా నమ్మకం ఏర్పడిన తరువాతే పాఠశాలల ను తిరిగి తెరుస్తామంటూ ఆయన స్పష్టం చేశారు.
74 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సెక్రటేరియట్లోనే సీఎం జెండా ఎగురవేశారు.ఈ సందర్భంగా కేజ్రీ వాల్ మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.రెండు నెలల క్రితం కంటే ప్రస్తుతం ఢిల్లీలో మెరుగైన పరిస్థితులే ఉన్నాయని, ఇప్పుడు కరోనా అదుపులోనే ఉన్నదని, దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా కేజ్రీ వాల్ కృతఙ్ఞతలు తెలిపారు.
అయితే పాఠశాలలను పునః ప్రారంభించడం పై ప్రజలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు అని, ప్రజలను నేను కలుస్తున్నాను వారంతా కూడా అప్పుడే తెరవొద్దు అంటూ కోరుతున్నారని,ఆప్ ప్రభుత్వానికి విద్యార్థుల భద్రత, ఆరోగ్యం చాలా ముఖ్యమని కేజ్రీ వాల్ తెలిపారు.
రాష్ట్రంలో పరిస్థితులు పూర్తిగా సంతృప్తి కలిగినప్పుడు మాత్రమే పాఠశాలలు అనేవి తెరుస్తామంటూ ఆయన స్పష్టం చేశారు.
ఇప్పటికే కోవిడ్ కేసులు ఢిల్లీ లో అధిక ప్రభావం చూపిన విషయం విదితమే.ఇప్పటివరకు 1 లక్ష 49 వేలకు పైగా కోవిడ్ కేసులు నమోదు కాగా, 4 వేల మందికి పైగా మృతులు చోటుచేసుకున్నాయి.
ప్రస్తుతం అక్కడ కోవిడ్ పరిస్థితులు కొంత మేరకు అదుపులోకి వచ్చినట్లు తెలుస్తుంది.