కరోనా వైరస్ తో దేశం మొత్తం గడగడ వణికి పోతుంది.రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులతో కోవిడ్ ఆస్పత్రులు నిండిపోతున్నాయి.
కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది.తెలుగు రాష్ట్రాల్లో అదే పరిస్థితి.
కాగా, కొన్ని చోట్లలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల బాధితులు ప్రాణాలకు గ్యారంటీ లేకుండా పోయింది.రిపోర్టులు మారిపోవడం, చనిపోయిన బాధితులను కుటుంబ సభ్యులకు బతికే ఉన్నాడని చెప్పడం వంటి సంఘటనలు చూస్తూనే ఉన్నాం.
తాజాగా ఓ వ్యక్తి కరోనా సోకి చికిత్స పొందుతూ అదృశ్యమయ్యాడు.
గుంటూరు జిల్లాలోని జీజీహెచ్ లో కరోనా సోకిన ఓ వ్యక్తి అదృశ్యమైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
కడియాల దుర్గా ప్రసాద్ అనే వ్యక్తికి గత కొద్ది రోజులుగా దగ్గు, జ్వరం రావడంతో అతడికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించారు వైద్యుడు.కాగా, ఈ నెల 14వ తేదీన అతడికి పాజిటివ్ వచ్చిందని వైద్యులు నిర్ధారించారు.
కుటుంబ సభ్యులు అతడిని సమీప తెనాలి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు.
ఆస్పత్రిలో మెరుగైన వైద్య సదుపాయాలు లేకపోవడంతో 16వ తేదీ రాత్రి జీజీహెచ్ ఆస్పత్రికి తరలించారు.
జీజీహెచ్ ఆస్పత్రిలో జాయిన్ చేసి 12 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకూ తన ఆచూకి కనిపించడం లేదని అతని భార్య వెంకాయమ్మ పేర్కొంది.ఆస్పత్రిలో అన్ని వార్డులు గాలించినా ఫలితంలేదు.
వైద్యులకు, సిబ్బందికి అడిగిన సరైన సమాధానం చెప్పడం లేదని ఆమె వాపోయారు.ఈ మేరకు భర్త తప్పిపోయాడని వెంకాయమ్మ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగించారు.