వారు వీరు అని తేడా లేకుండా కరోనా వైరస్ కారణంగా ప్రతి ఒక్కరు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ వైరస్ మహమ్మారి ఎప్పుడు అదుపులోకి వస్తుందో తెలియక అంతా సతమతమవుతున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది.భారతదేశంలో ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు లాక్ డౌన్ అంటూ కేంద్రం ప్రకటించి కఠినమైన నిబంధనలతో దీనిని అమలు చేస్తోంది.
ఇదిలా ఉంటే కరోనా వైరస్ ప్రభావం రాజకీయాలపై తీవ్ర స్థాయిలో పడింది.ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు హాట్ హాట్ గానే ఉంటూ వస్తాయి.
ప్రతిపక్షం, అధికార పార్టీ మధ్య ఎప్పుడూ యుద్ద వాతావరణం నెలకొని ఉంటుంది.అయితే కరోనా వైరస్ ప్రభావం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి.
ఎప్పుడు ప్రెస్ మీట్లు, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉండే నేతలంతా ఇప్పుడు కరోనా వైరస్ ప్రభావం కారణంగా పూర్తిగా సైలెంట్ అయిపోయారు.
నాయకులు మొత్తం ఇళ్లకే పరిమితం అవుతున్నారు.ప్రజల్లో అవగాహన పెంచేందుకు అప్పుడప్పుడు బయటికి వస్తున్న పూర్తిగా రాజకీయ విషయాలను పక్కన పెట్టేశారు.ఇక ఏపీలో మొన్నటి వరకు హాట్ హాట్ గా సాగిన స్థానిక సంస్థల ఎన్నికల విషయంలోనూ ఇదే జరిగింది.
కరోనా వైరస్ కారణంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడం పైన ఏపీలో పెద్ద ఎత్తున రాద్ధాంతం నడిచింది.దీనిపై వైసీపీ నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
అయితే ఇదంతా ఇప్పుడు పూర్తిగా సద్దుమణిగి పోయింది.ఈ కరోనా కారణంగా ఆంధ్రప్రదేశ్ లో కొత్త బిజెపి అధ్యక్షుడు నియామకం కూడా ఆగిపోయింది.
తెలంగాణలో టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదగాలని భావిస్తున్న బిజెపి కొత్త అధ్యక్షుడిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ను నియమించింది.ఆయన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బిజెపి తెలంగాణలో పూర్తిస్థాయిలో బలపడుతుందని టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బిజెపి న ముందుకు తీసుకెళ్లడంలో విజయం సాధిస్తారని, ఆ పార్టీ అధిష్టానం బలంగా నమ్ముతోంది.అయితే కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్ ఇంకా తన కార్యకలాపాలను మొదలు పెట్టకుండానే కరోనా కారణంగా ఆయన చురుగ్గా ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు.ఇక తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు నియామక విషయంలోనూ ఇదే రకమైన పరిస్థితి కనిపిస్తోంది.
మొత్తంగా చూస్తే వైరస్ కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులను ఒక్కసారిగా మార్చి వేసినట్లే కనిపిస్తోంది.