ఆంధ్ర తెలంగాణ విభేదాలు ఎలా ఉన్నా, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ ఇద్దరూ స్నేహానికి ఆదర్శం అన్నట్లుగా వ్యవహరిస్తూ వచ్చారు.రెండు రాష్ట్రాలకు సంబంధించిన విభజన సమస్యలను చాలా సులభంగా పరిష్కరించుకుంటారు.
రెండు రాష్ట్రాలకు ఇబ్బంది లేకుండా అన్ని వ్యవహారాలను చక్క పెట్టుకున్నారు.ఇద్దరి ఉమ్మడి శత్రువు టిడిపి అధినేత చంద్రబాబే కావడంతో, వీరి మధ్య స్నేహం మరింతగా బలపడడానికి కారణమైంది.2019 ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం ఏర్పడడానికి కేసీఆర్ ప్రత్యక్షంగా, పరోక్షంగా సహాయం అందించారు.ఈ స్నేహం ఇలా ఉండగానే, ఆకస్మాత్తుగా కృష్ణా జలాల వివాదం మొదలైంది.
రాయలసీమ జిల్లాలకు తాగు, సాగునీరు అందించాలనే ఉద్దేశంతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఎత్తును పెంచేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నించడంతో, చిన్నగా ఇద్దరి మధ్య వివాదం మొదలైంది.దీంతో అది చిలికి చిలికి గాలివానలా మారి, ఇప్పుడు ఇద్దరి స్నేహం దెబ్బతీసే విధంగా తయారయింది . కృష్ణాజలాల అంశంలో రెండు రాష్ట్రాలకు మధ్య సయోధ్య కుదిర్చేందుకు కేంద్రం పెద్దన్న పాత్ర తీసుకుంది.ఈ మేరకు అపెక్స్ కమిటీ సమావేశాన్ని రేపు ఏర్పాటు చేసి, రెండు రాష్ట్రాలకు సంబంధించిన జల వివాదం పై కేంద్రం ఇప్పుడు పెదరాయుడు తీర్పు చెప్పేందుకు సిద్ధమైంది.
కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ దీనికి సంబంధించిన సమావేశాన్ని ఏర్పాటు చేసింది.ఇప్పటికే అనేక వాయిదాల పడుతూ వచ్చిన ఈ సమావేశం మంగళవారం నిర్వహించనున్నారు.
ఇప్పుడు పెదరాయుడు పాత్రలో కేంద్రం చెప్పబోయే తీర్పు పై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.ఎందుకంటే ఇది కేవలం రెండు రాష్ట్రాల మధ్య వివాదమే కాదు, రాజకీయంగాను, అనేక పరిణామాలకు తెరతీసే విషయం.
ఎందుకంటే కొంతకాలంగా టిఆర్ఎస్ అదేపనిగా కేంద్రంపై విరుచుకుపడుతూ, తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వస్తోంది.
ముఖ్యంగా విద్యుత్ సంస్కరణలు, వ్యవసాయ సంస్కరణల బిల్లు విషయంలో కేంద్రం తీరును తప్పుపడుతూ, వివాదాలకు దిగుతోంది.
అదీ తెలంగాణలో బలపడుతున్న బిజెపి, టిఆర్ఎస్ ని టార్గెట్ చేసుకుంటూ కొంతకాలంగా వ్యవహరిస్తున్న తీరు, ఇలా అనేక అంశాలు ఆధారంగా కేంద్రం తీసుకునే నిర్ణయం ఆధారపడి ఉంటుందనే అంచనాలు ఉన్నాయి.అలాగే ఏపీ విషయానికి వస్తే, వైసిపి కేంద్రానికి ప్రతి దశలోనూ మద్దతు పలుకుతూ వస్తోంది.
కేంద్రం నిర్ణయాలతో రాష్ట్ర స్థాయిలో విమర్శలు వస్తాయని తెలిసినా, మద్దతు ప్రకటిస్తూ వస్తోంది.ఈ నేపథ్యంలో ఈ కమిటీలో కేంద్రం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఏ విధంగా రాజీ చేస్తుంది ? దీనికి రాజకీయ అంశాలను ముడి పెడుతుందా ఇలా అనేక అంశాలపై క్లారిటీ రావాల్సి ఉంది.