ఒకటి కాదు రెండు కాదు, ఎన్నో కేసులను ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం బయటకు తీస్తోంది.టిడిపి ప్రభుత్వంలో ఎన్నో అవినీతి వ్యవహారాలు చోటుచేసుకున్నాయి అని, భారీ ఎత్తున కుంభకోణాలకు అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్పడ్డారని ఆరోపణలు చేయడమే కాదు, వాటిపై లోతుగా విచారణ చేయిస్తూ, అరెస్టులు చేస్తూ టీడీపీ శ్రేణులను భయబ్రాంతులకు గురి చేసే విధంగా ఏపీ ప్రభుత్వం ముందుకు వెళుతున్నట్లుగా కనిపిస్తోంది.
అసలు టిడిపి లో కీలక నాయకులు ఎవరూ ఉండకుండా వారిని ఆ పార్టీ కి దూరం చేయడం, లేక తమ పార్టీలో చేర్చుకోవడమో చేస్తోంది.ఏపీలో టిడిపి బలపడేందుకు ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ఆ పార్టీని మరింత బలహీనం చేసి వచ్చే ఎన్నికలనాటికి ఉనికిలో లేకుండా చేయాలనే విధంగా జగన్, ఆ పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్ లోని తన సొంత నివాసానికి పరిమితమైపోవడంతో, ఏపీలో వైసిపి మరింత దూకుడు పెంచింది.నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలోనూ గత టిడిపి ప్రభుత్వ హయాంలో నెలకొన్న అవినీతి, అక్రమాలపై లోతుగా విచారణ చేయించాలని మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చిన నివేదికను ఆమోదించిన సందర్భంగా వెల్లడించారు.ముఖ్యంగా గత ప్రభుత్వంలో అమలైన చంద్రన్న కానుక, రంజాన్ తోఫా, ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ , సెటప్ బాక్స్ ల కొనుగోళ్లలో భారీ కుంభకోణాలు జరిగిందని, అలాగే ఏపీ ఫైబర్ నెట్ లో సుమారు 700 కోట్ల వరకు అవినీతి జరిగినట్లు ఏపీ మంత్రివర్గ ఉప సంఘం నిర్ధారించి సిబిఐకి ఈ వ్యవహారాలను అప్పగించాలని నిర్ణయం తీసుకోవడంతో తెలుగుదేశం పార్టీలో భయాందోళనలు మొదలయ్యాయి.ముఖ్యంగా ఏపీ ఫైబర్ నెట్ వ్యవహారంలో యువ నాయకుడు, చంద్రబాబు రాజకీయ వారసుడు నారా లోకేష్ ను టార్గెట్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.
ఇక వైసీపీ ప్రభుత్వం ఈ స్థాయిలో దూకుడుగా వెళ్లడంలో కేంద్ర అధికార పార్టీ బిజెపి మద్దతు ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ప్రస్తుతానికి టిడిపికి బిజెపికి రాజకీయ వైరం పెద్దగా లేకపోయినప్పటికీ, గతంలో బిజెపి టిడిపి పొత్తు పెట్టుకోవడం, ఆ తర్వాత దానిని రద్దు చేసుకోవడం జరిగాయి.అలాగే అప్పటి హోం మంత్రిగా, బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న అమిత్ షా తిరుపతికి వచ్చిన సందర్భంగా ఆయన పై కొంతమంది రాళ్లు విసరడం, ఆ వ్యవహారంలో టిడిపి హస్తం ఉందని బిజెపి నమ్మడం వంటి పరిణామాలు జరిగాయి.ఇక అప్పటి నుంచి బిజెపి సైలెంట్ గానే ఉంటూ వస్తోంది.
ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ద్వారా తమ రాజకీయ కక్ష తీర్చుకుంటుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తాజాగా మాజీ మంత్రి టీడీపీ కీలక నాయకుడు కింజరాపు అచ్చెన్నాయుడు ను ఏసీబీ అధికారులు అరెస్టు చేయడంతో టిడిపిలో కలకలం రేగుతోంది.ఇక వరుస పెట్టి ఏపీ ప్రభుత్వం టీడీపీలో పెద్ద తలకాయలను టార్గెట్ చేసుకోబోతోందా అనే విధంగా ముందుకు వెళ్తున్నట్టుగా కనిపిస్తుండటంతో, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన సమయం వచ్చేసిందని తెలుగుదేశం పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు.ప్రస్తుత పరిణామాల్లో టిడిపి నాయకులు తీవ్ర స్థాయిలో భయాందోళనలు నెలకొన్నట్లు తెలుస్తోంది.
గత టీడీపీ ప్రభుత్వం జరిగిన అవినీతి వ్యవహారాలు ఏ ఒక్కటి వదిలిపెట్టకుండా వెలికితీయాలని వైసీపీ ప్రభుత్వం ఉండడం తో ఇప్పుడు టిడిపి నాయకు ల్లో టెన్షన్ పెరుగుతున్నట్లుగా కనిపిస్తోంది.