వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వంద రోజుల పాలన పూర్తి చేసుకుంది.ఈ వంద రోజుల పాలనలో ఎన్నో సంస్కరణలు, ఎన్నో పథకాలు, మరెన్నోసంచలనాలకు తెరలేపారు.
జగన్ పాలనపై కొంత సంతృప్తి మరికొంత అసంతృప్తి ప్రజల్లో నెలకొంది.ఇవన్నీ పక్కనపెడితే ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి పార్టీలోకి పెద్దగా చేరికలు లేవనే చెప్పాలి.
అసలే అధికార పార్టీ అందులోనూ భారీ సంఖ్యలో సీట్లు సాధించడంతో వైసీపీలోకి వలస వచ్చేందుకు అన్ని పార్టీల నాయకులూ, కొంతమంది ఎమ్యెల్యేలు ఆరాటపడ్డారు.అయితే జగన్ మాత్రం చేరికలకు నో ఎంట్రీ బోర్డు పెట్టేయడంతో వైసీపీలో చేరాలనుకు ఆరాటపడ్డ వారంతా ఉసూరుమన్నారు.
ప్రత్యామ్న్యాయంగా కొంతమంది టీడీపీ నేతలు బీజేపీలో చేరిపోయారు.ఇక మిగిలి ఉన్న నాయకులు జగన్ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూపులు చూస్తున్నారు.
అయితే ఈ మధ్యకాలం లో వలసలతో బీజేపీ దూకుడు పెంచడంతో పాటు వైసీపీ మీద ఎదురుదాడి తీవ్రతరం చేయడంతో బీజేపీ హవా తగ్గించేందుకు జగన్ వలసలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఈ మేరకు వివిధ పార్టీల్లో ఉన్న బడా బడా నాయకులను తమ పార్టీలో చేర్చుకోవాలనే ఆలోచనలో వైసీపీ ఉంది.దీనిలో భాగంగానే తూర్పుగోదావరి జిల్లాలో కీలకమైన కాపు సామాజిక వర్గానికి చెందిన తోట త్రిమూర్తులను చేర్చుకోవాలని ఆలోచనలో వైసీపీ ఉంది.ఆయన వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పార్టీలోకి రావాలని చూస్తున్నారు.
కానీ ఇప్పటికి ఆయనకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది.నిన్ననే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన త్రిమూర్తులు ఈ నెల 18 వ తేదీన తాను వైసీపీలోకి వెళ్లబోతున్నట్లు ప్రకటించారు.
ఇక ఆ మధ్యన టీడీపీకి రాజీనామా చేసిన ఏపీ మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు సోదరుడు సన్యాసి పాత్రుడు కూడా వైసీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.ఈ మేరకు అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులతో నిత్యం ఆయన సంప్రదింపులు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
వీరితో పాటు గతంలో వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేసిన నాయకులు కూడా తిరిగి సొంత గూటికి వచ్చేందుకు చూస్తున్నట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.ఈ క్రమంలో వారందరూ జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నారన్నది విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఇక ఒక్కసారి వారికి జగన్ ఓకే చెబితే త్వరలోనే వైసీపీలోకి భారీ వలసలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ వలస ద్వారా బీజేపీ దూకుడుకి బ్రేకులు వేయడంతో పాటు తెలుగుదేశం పార్టీకి గట్టి షాక్ ఇవ్వాలని జగన్ భావిస్తున్నాడట.కాకపోతే వైసీపీలో చేరాలనుకునే నాయకులు తప్పనిసరిగా తమ పదవులకు రాజీనామా చేయాలనే షరతులు జగన్ విధించారు.ఇప్పుడు కూడా ఆ విషయంలో జగన్ ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గకూడదని జగన్ భావిస్తున్నారట.
ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు వైసీపీలోకి వెళ్లాలనుకున్నాజగన్ పెట్టిన షరతులతో వెనక్కి తగ్గుతున్నారట.జగన్ కనుక ఆ ఒక్క విషయంలో నిబంధనలు సడలిస్తే చాలామంది ఎమ్యెల్యేలు వలస వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.
త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ జెండా రెపరెపలాడించడంతో పాటు బీజేపీ ఏపీలో బలపడకుండా చేయాలనే ఉద్దేశంతో జగన్ ఇప్పుడు డోర్లు తెరిచినట్టు అర్ధం అవుతోంది.