రాజకీయాల యందు ఏపీ రాజకీయాలు వేరయా అన్నట్టుగా తయారైంది ప్రస్తుత పరిస్థితి.కొద్దిరోజులుగా నాయకుల మధ్య రేగుతున్న కుల చిచ్చు, కుల విమర్శలు మరీ శృతిమించినట్టుగా కనిపిస్తున్నాయి.
నాయకులు కులాల వారీగా విడిపోవడమే కాకుండా, ఈ సమాజాన్ని కూడా అదే విధంగా విడగొట్టే విధంగా నాయకులు తయారుచేస్తున్నారు.అసలు తాము రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాం ? ఏం చేస్తున్నాం అనే విషయాన్ని మరిచిపోయి, తిట్లు, శాపనార్ధాలు, అన్నట్టుగా నేటి రాజకీయాలు మారిపోయాయి.
పార్టీ ఏదైనా, నాయకుడు ఎవరైనా, అంతిమంగా రాజకీయ నాయకుల ప్రధాన విధి ప్రజలకు సేవ చేయడం.గత పాలకుల కంటే మెరుగైన విధంగా ప్రజలకు పరిపాలన అందిస్తూ, ఎవరికీ ఏ కష్టం రాకుండా చూసుకుంటూ, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకు వెళ్లే విషయంపై దృష్టి పెట్టకుండా, నాయకులు అంటే తిట్టుకోవడానికి, కొట్టుకోవడానికి మాత్రమే ఉన్నారు అన్నట్లుగా కొంత మంది రాజకీయ నాయకులు వ్యవహరిస్తున్న తీరుతో అసలు రాజకీయాలంటేనే అసహ్యం కలిగించే పరిస్థితి ఏర్పడుతోంది.
ఎప్పుడో రాజకీయాలు వేరు.ప్రస్తుత రాజకీయాలు వేరు.
ఇప్పుడు రాజకీయం అంతా కులాల వారీగా విడిపోయినట్టుగానే కనిపిస్తోంది.ఒక పార్టీ అధికారంలో ఉండగా, తమ ప్రత్యర్థి పార్టీకి చెందిన సామాజిక వర్గానికి చెందిన నాయకులను, అధికారులను టార్గెట్ చేసుకుంటూ ,వేధిస్తూ, విమర్శిస్తూ, ఇబ్బందులకు గురి చేస్తూ రావడం, అలా అధికార పార్టీ చేతిలో ఇబ్బందులకు గురైన వారి పార్టీ, మళ్లీ అధికారంలోకి వస్తే మళ్ళీ ఇదే సీన్ రిపీట్ అవ్వడం, ఇవన్నీ పరిపాటిగా మారిపోయాయి.
ప్రస్తుత రాజకీయం అంతా కులం చుట్టూనే తిరుగుతోంది.
ఒకప్పుడు కుల ప్రస్తావన తీసుకు వచ్చి ఏదైనా విమర్శ చేసేందుకు నాయకులు కానీ, ప్రజలు కానీ చాలా ఆలోచించేవారు.కానీ ప్రస్తుత నాయకులు మాత్రం తమ రాజకీయ ప్రత్యర్థులను, తమకు గిట్టని అధికారులను నేరుగా కులం పేరుతోనే దూషిస్తూ, వ్యవహరిస్తున్న తీరు రాజకీయాల పట్ల చిన్న చూపు ను ప్రజలకు కలిగిస్తున్నాయి.ఇప్పుడు ప్రతీ అంశం కులానికి, మతానికి ముడిపెట్టే విధంగానే ఉంటున్నాయి.
అన్నీ పార్టీల నాయకులు ఇదే తంతు గా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఈ పోకడ మరీ ఎక్కువ అయినట్టుగా కనిపిస్తోంది.
ఒక కులం నాయకుడిని తిట్టించాలి అంటే, అదే కులానికి చెందిన నాయకుడిని తెరమీదకు తెచ్చి తిట్టించడంలో అన్ని పార్టీలు ఆరితేరి పోయాయి.కులాలు, మతాలు లేవని, మనమంతా ఒకటే అని పదేపదే ఉపన్యాసాలు దంచే నాయకులు వాస్తవంలోకి వచ్చేసరికి అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు.
ప్రస్తుతం ఈ తరహా కుల రాజకీయాలు ఏపీలో ఎక్కువైపోయాయి.ప్రధానంగా టీడీపీ, వైసిపి నాయకులు నిత్యం చేసుకుంటున్న విమర్శలు ప్రజల్లోనూ చర్చనీయాంశం అవుతున్నాయి.
నాయకులను చూసి సమాజం కూడా కులాల వారిగా విడిపోతున్న తీరు బాధను, ఆగ్రహాన్ని, ఆవేశాన్ని అన్నిటినీ కలిగిస్తున్నాయి.
కుల విమర్శలకు పాల్పడుతున్న పార్టీల్లో వైసిపి, టీడీపీ, బిజెపి, జనసేన ఇలా ఏ పార్టీ దీనికి అతీతం కాదు అన్నట్టుగానే వ్యవహరిస్తున్నాయి.
ఈ పార్టీలో ఉన్న నాయకులంతా ఈ తరహా రాజకీయాలు చేస్తున్నారని చెప్పడానికి వీలు లేదు కానీ, ఈ పార్టీల్లో ఉన్న కొంతమంది నాయకులు కుల విద్వేషం రగుల్చుతూ, కులం, మతాల వారీగా సమాజాన్ని చీల్చి, కులం పేరుతో దూషణలు చేసుకుంటూ, సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున విమర్శలకు దిగుతూ, మాట్లాడుతున్న తీరు ప్రస్తుత రాజకీయాల తీరు తెన్నులకు అర్థం పడుతుంది.ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా, దానికి కులాన్ని ఆపాదించడం ఈ మధ్య కాలంలో ఎక్కువైంది.
రాజకీయాల్లో ఈ కుల విమర్శలకు ఇప్పట్లో అడ్డుకట్ట పడేలా కనిపించడం లేదు.కుల రహిత సమాజాన్ని నిర్మిస్తామని చెబుతున్న నాయకులే ఇప్పుడు కుల చిచ్చు రేపే విధంగా తయారవ్వడం కాస్త బాధాకరమే.