ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి చాప కింద నీరులా శరవేగంగా వ్యాప్తి చెందుతోంది.జగన్ సర్కార్ ఎన్ని చర్యలు చేపడుతున్నా వైరస్ ను అదుపు చేయడంలో పూర్తిస్థాయిలో సక్సెస్ కావడం లేదు.
రాష్ట్రంలో ప్రతిరోజూ 10,000కు అటూఇటుగా కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నాయి.కరోనా విజృంభించిన తొలినాళ్లలో అసలు కేసులే నమోదు కాని శ్రీకాకుళం జిల్లాలో సైతం వైరస్ విలయం కొనసాగుతోంది.
శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకాకుళం టౌన్ లో కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు.టౌన్ లో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒకటి వరకు మాత్రమే వస్తువులు కొనుగోలు చేయడానికి అనుమతులు ఇస్తూ మిగిలిన సమయంలో పూర్తిస్థాయి లాక్ డౌన్ ను అమలు చేయడానికి సిద్ధమవుతున్నారు.
టౌన్ లో నెలరోజుల పాటు 144 సెక్షన్ అమలులో ఉండనుందని సమాచారం.
కేవలం మెడికల్ దుకాణాలకు మాత్రమే ఒంటి గంట తర్వాత అనుమతులు ఇస్తామని పట్టణంలో ఒంటి గంట తరువాత రోడ్లపై ఎవరైనా కనిపిస్తే కేసులు నమోదు చేయడానికైనా వెనుకాడబోమని అధికారులు తెలిపారు.
పట్టణంలోకి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారిపై నిషేధం కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు.ఎవరైనా పట్టణంలోకి వెళ్లాలంటే ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట లోపే పనులను ముగించుకోవాల్సి ఉంటుంది.
అధికారులు శ్రీకాకుళం టౌన్ లోకి ప్రవేశించడానికి వీలు ఉన్న ఆరు మార్గాలపై దృష్టి పెట్టారు.ఈ మార్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టి అనవసరంగా తిరుగుతున్న వారిని తిరిగి పంపించనున్నారు.
ప్రజలు వీలైనంత వరకు ఇళ్లకే పరిమితం కావాలని అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చినా మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించి, తరచూ చేతులను శుభ్రం చేసుకుంటూ వైరస్ బారిన పడకుండా కాపాడుకోవాలని సూచించారు.