అకస్మాత్తుగా వైసీపీతో స్నేహం చేయాలని కేంద్ర బీజేపీ పెద్దలు డిసైడ్ అయి పోవడమే కాకుండా, అంతే అకస్మాత్తుగా జగన్ ను ఢిల్లీకి పిలిపించుకుని మరీ తమ మనసులోని మాటను బయట పెట్టారు.తప్పనిసరిగా ఎన్డీఏ లో చేరాల్సిందిగా ప్రధాని జగన్ ను కోరడం, దీనిపై క్లారిటీ ఇచ్చేందుకు కొంత సమయం ఇవ్వాల్సిందిగా జగన్ కోరడం వంటి పరిణామాలు జరిగాయి.
వారు భేటీకి సంబంధించి అనేక వార్తలు పెద్ద ఎత్తున వచ్చాయి.ఎన్డీఏ లో చేరితే కేంద్ర మంత్రి పదవులు రెండు కానీ, మూడు కానీ ఇచ్చేందుకు బిజెపి సైతం సిద్ధమైందని వైసీపీ కూడా చెప్పుకుంది.
అయితే బిజెపిలో వైసీపీ చేరితే లాభం ఎంత ఉంటుంది ? నష్టం ఎంత ఉంటుంది అనే విషయాలను జగన్ ఇప్పుడు లెక్కలు వేసుకునే పనిలో ఉన్నారట.పదేపదే బీజేపీ నుంచి ఒత్తిడి వస్తున్న తరుణంలో, తమకు ఇబ్బంది రాకుండా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అంటూ జగన్ పట్టుబడుతూ ఉండడం, ఆ హోదా విషయం తప్ప మరేదైనా చేసేందుకు తాము సిద్ధమనే సంకేతాలను బిజెపి ఇస్తూ ఉండడం వంటి పరిణామాలతోనే ఎన్డీఏ లోకి వైసీపీ చేరిక ఆలస్యం అవుతుందనే ప్రచారం ఇప్పుడు మొదలైంది.
ఏపీకి ప్రత్యేక హోదా అంశం పై వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పెద్ద ఎత్తున పోరాటం చేసింది.ఢిల్లీకి ప్రత్యేక రైళ్లలో వైసిపి నాయకులు వెళ్లి మరీ అక్కడ హడావుడి చేశారు.
ఇప్పుడు వైసీపీ ఏపీలో అధికారంలో ఉంది.దీనికి తోడు ఆ పార్టీ అవసరం కేంద్ర అధికార పార్టీ బీజేపీకి ఉంది.
ఈ సమయంలో జగన్ ప్రత్యేక హోదా అంశాన్ని పక్కనపెట్టి, బీజేపీతో చెట్టా పట్టాల్ వేసుకుని తిరిగితే, ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదురవడంతో పాటు, రాజకీయంగాను కోలుకోలేని దెబ్బ తింటారని, ఇదే అదనుగా, తెలుగుదేశం పార్టీ తమపై దుష్ప్రచారం చేస్తుందనే భయం జగన్ ను వెంటాడుతోంది.అందుకే హోదా విషయాన్ని జగన్ బీజేపీ దగ్గర అంతగా పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది.
కానీ హోదా విషయాన్ని పక్కన పెట్టి, ఏ విషయంలోనైనా మీకు అనుకూలంగా ఉండేందుకు తాము సిద్ధమనే సంకేతాలను బీజేపీ ఉండడంతో, ఏం చేయాలి తెలియని గందరగోళ పరిస్థితుల్లో వైసిపి ఉందట.మరీ ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా జగన్ ను ఎన్డీఏలో చేరవలసిందిగా పట్టు పడుతుండటం , రానున్న రోజుల్లో బీజేపీ అవసరం తమకు ఎంతగానో ఉండటం వంటి అన్ని విషయాలను లెక్కలోకి తీసుకుంటూ జగన్ ఇప్పుడు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తుంది.వైసీపీ ఎన్డీయేలోకి వచ్చి చేరితే లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పదవి కూడా ఆఫర్ చేసినట్లు ప్రచారం జరిగింది.
ఈ పదవిలో జగన్ కు అత్యంత సన్నిహితుడైన మిథున్ రెడ్డి కూర్చోబోతున్నారనే ప్రచారం జరిగింది.
హోదా విషయంలో జగన్ వెనక్కు తగ్గుతున్న విషయాన్ని గుర్తించిన మోదీ, ఏదోరకంగా ఈ విషయంలో ఆయన్ను ఒప్పించేందుకు, ఏపీకి అవసరమైతే ప్రత్యేక నిధులు ఇచ్చేందుకు తాము సిద్ధమనే సంకేతాలను పంపిస్తూ, జగన్ పై ఒత్తిడి పెంచుతున్నారట.ఇదే విషయం పై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఈ ఒత్తిడితో జగన్ హోదా అంశాన్ని పక్కనబెట్టి బీజేపీతో జత కడతారా లేక హోదా కోసం మరింతగా పట్టుబట్టి, బీజేపీ ని ఒప్పిస్తారా అనేది తేలాల్సి ఉంది.