దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది.దేశంలోని అన్ని రంగాలపై కరోనా ప్రభావం పడినా విద్యా రంగంపై ఆ ప్రభావం ఎక్కువగా ఉంది.
ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ నేటి నుంచి రాష్ట్రంలో పాఠశాలలను పునఃప్రారంభించాలని భావించింది.అయితే అన్ లాక్ 4.0 మార్గదర్శకాల ప్రకారం కేంద్రం పాఠశాలల రీఓపెన్ కు అనుమతులు ఇవ్వకపోవడంతో పాఠశాలల ఓపెనింగ్ మరోసారి వాయిదా పడింది.
జగన్ సర్కార్ పాఠశాలలు పారంభమైతే నేడు జగనన్న విద్యాకానుక కార్యక్రమాన్ని అమలు చేయాలని భావించింది.
కానీ అన్ లాక్ నిబంధనల వల్ల ఈ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు పాఠశాల విద్య సంచాలకుడు వాడ్రేవు చినవీరభద్రుడు తెలిపారు.వచ్చే నెల ఐదవ తేదీకి ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.
జగనన్న విద్యాకానుక కార్యక్రమంతో పాటు రాష్ట్రంలో అక్టోబర్ 5వ తేదీనే పాఠశాలల ప్రారంభం కూడా ఉండబోతుందని తెలుస్తోంది.
అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు జగనన్న విద్యాకానుకకు సంబంధించి ఈ విషయాలను గమనించాలని చినవీరభద్రుడు పేర్కొన్నారు.
జగనన్న విద్యాకానుక ద్వారా స్కూల్ బ్యాగ్, యూనిఫామ్, బూట్లు, బుక్స్, ఇతర వస్తువులు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అందే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.మరోవైపు నాడు – నేడు పథకం అమలు ద్వారా జగన్ సర్కార్ రాష్ట్రంలోని పాఠశాలల రూపురేఖలు మార్చే దిశగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే నాడు నేడు కార్యక్రమం అమలు ద్వారా రాష్ట్రంలోని పలు పాఠశాలల రూపురేఖలు మారిపోయాయి.ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి దిశగా జగన్ సర్కార్ అడుగులు వేస్తుండటంపై ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది.