రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయడం అధికార పార్టీ వైసీపీకి ఎంత మాత్రం రుచించడం లేదు.ఇప్పటికే ఎన్నికల కమిషనర్ కి కులం అంటగట్టి పార్టీలోని ముఖ్యనేతలందరూ మూకుమ్మడిగా విమర్శలతో దాడి చేస్తున్నారు.
అయితే ఈ ఎన్నికలు వాయిదా నిర్ణయం వెనక్కి తీసుకునేలా చేసి తమ పంతం నెగ్గించుకోవడానికి అధికార పార్టీ తనకున్న అన్ని అవకాశాలు వాడుకోవడానికి సిద్ధమవుతుంది.అందులో భాగంగా ఎన్నికల కమిషనర్ తీసుకున్న ఈ నిర్ణయంపై సుప్రీం కోర్టులో పిటీషన్ వేయడానికి రెడీ అవుతున్నారు.
ఈ విషయాన్ని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలియజేశారు.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తీసుకున్న ఈ అనాలోచిన నిర్ణయం వల్ల రాష్ట్రానికి నష్టం తప్పదని, ఎన్నికల ప్రక్రియ ఈనెల 31లోగా ముగించకపోతే స్థానిక సంస్థలకు కేంద్రం నుంచి రావాల్సిన 14వ ఆర్థిక సంఘం నిధులు 5 వేల కోట్లకు పైగా రాకుండా ఆగిపోయే ప్రమాదం ఉందని సుప్రీం కోర్టుకి తెలియజేయనున్నట్లు తెలిపారు.
కరోనా వైరస్ ప్రభావంపై చీఫ్ సెక్రటరీతో గానీ, హెల్త్ సెక్రెటరీతోగానీ సమీక్షించకుండా, సంప్రదింపులు జరపకుండా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఏకపక్ష నిర్ణయం తీసుకోవడాన్ని సుప్రీంకోర్టుకు నివేదించనున్నట్లు తెలిపారు.స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ఈ నెలాఖరుకు షెడ్యూల్ ప్రకారం ముగిస్తే.
పాలన మరింత బలపడుతుందన్న అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తామని అన్నారు.వ్యాధుల నివారణలో స్థానిక సంస్థల పాత్ర కీలకమని కూడా ప్రభుత్వం తరుపున వాదనలు వినిపిస్తామని స్పష్టం చేశారు.
అదే సమయంలో ఎన్నికల కమిషనర్ తీసుకున్న అనాలోచిత నిర్ణయం, కుట్ర కోణం కూడా సుప్రీం కోర్టు ముందు ఉంచుతామని తెలిపారు.