ఉమ్మడి రాష్ర్ట విభజన రైల్వే శాఖపై ప్రభావం చూపింది.ప్రభావం చూపడమంటే ఆదాయం తగ్గిపోవడమని అర్థం.
రైల్వే అధికారులు ఈ విషయమే చెప్పుకొని ఆవేదన చెందుతున్నారు.రైల్వేకు అనేక విధాలుగా ఆదాయం తగ్గిందని, అందులో రాష్ర్ట విభజన ప్రధాన కారణమని అధికారులు చెబుతున్నారు.
మొన్నీమధ్యనే కదా విభజన జరిగింది.అప్పుడే ఆదాయం బాగా పడిపోయిందా అంటే అవుననే అంటున్నారు.
విభజన తరువాత ఆంధ్రా నుంచి జంట నగరాలకు వచ్చే ప్రయాణికుల సంఖ్య బాగా పడిపోయిందట.దీంతో అరవై నుంచి డెబ్బయ్ లక్షల రూపాయల మేరకు ఆదాయం తగ్గిపోయిందట.
ఇది ఒక రోజు ఆదాయం అయివుండొచ్చు.అంటే రోజూ డెబ్బయ్ లక్షల మేరకు ఆదాయం తగ్గితే బాగానే తగ్గినట్లు కదా.రోడ్డు రవాణా మీద అంటే బస్సులపై విభజన ప్రభావం పెద్దగా లేదట.ఈ వివరాలన్నీ రైల్వే కమిటీ తన తాజా నివేదికలో తెలియచేసింది.
ఏడాదిలోగానే ఆదాయం ఇంత తగ్గితే పదేళ్ల తరువాత ఇంకా తగ్గిపోతుందా? కావొచ్చు.ఆంధ్రాలోనూ పరిశ్రమలు బాగా పెరిగిపోయి అక్కడే ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటే తెలంగాణకు ఎందుకు వస్తారు.
రాజధాని నిర్మాణం పూర్తయిపోయి ప్రభుత్వమే అక్కడి నుంచి పనిచేస్తే ఇక హైదరాబాదుతో పనేముంటుంది? హైదరాబాదుకు తెలంగాణలోని జిల్లాలన్నీ దగ్గరే కాబట్టి ఆంధ్రుల తాకిడే ఎక్కువగా ఉంటుంది.కొన్నేళ్ల తరువాత ఈ తాకిడి బాగా తగ్గుతుంది.
విభజన జరిగాక ఇలాంటివి అనేకముంటాయి.ఉన్న ఆదాయంతోనే సర్దుకోవాలి మరి.