రాజధాని ప్రాంతంలో అమరావతి రైతులు చేపట్టిన ఉద్యమం తీవ్రస్థాయిలో ఊపందుకున్న నేపథ్యంలో, ఈ ప్రాంత ఆవేదనను రాష్ట్ర వ్యాప్తంగా తీసుకువెళ్లేందుకు జేఏసీ, విపక్షాల ఆధ్వర్యంలో తలపెట్టిన బస్సు యాత్రకు పోలీసులు షాక్ ఇచ్చారు.ఆర్టిఏ తో పాటు పోలీసుల నుంచి అనుమతి లేదంటూ బస్సులను ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు.
దీంతో జేఏసీ నాయకులు ప్రయాణించాల్సిన బస్సులు ఎక్కడివి అక్కడే నిలిచిపోయాయి.
సుమారు ఐదు బస్సుల్లో 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో రైతులు, రాజకీయ నాయకులు ప్రజా సంఘాలతో ఈ యాత్ర నిర్వహించాలని ముందుగా ప్లాన్ చేసుకున్నారు.
ఈ యాత్రను బెంజ్ సర్కిల్ వద్ద చంద్రబాబు ప్రారంభించాల్సి ఉండగా పోలీసులు అడ్డుకోవడంతో యాత్ర వాయిదా పడింది.దీంతో పోలీసులు వ్యవహరించిన తీరుపై అమరావతి పరిరక్షణ సమితి నాయకులు తీవ్రంగా మండిపడ్డారు.
తాము ఆర్టీఏ అన్ని అనుమతులు తీసుకున్నా తమ యాత్రను ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవాలని జగన్ ప్రభుత్వం ఈ కుట్రలకు పాల్పడుతోందని, అసలు పోలీసుల నుంచి అనుమతి ఎందుకు తీసుకోవాలని వారు ఎదురు ప్రశ్నించారు.జగన్ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా తమ యాత్రను కొనసాగించి తీరుతామని ప్రకటించారు.
అమరావతి నుంచి రాజధానిని తరలించకుండా తాము చివరి వరకు పోరాడతామని ఈ సందర్భంగా జేఏసీ నాయకులు ప్రకటించారు.