దేశ వ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తుంది.రోజురోజుకి కరోనా బాధితుల సంఖ్య పెరిగిపోతుంది.
లాక్ డౌన్ సడలింపుల తర్వాత దేశంలో కరోనా బారిన పడే వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోతుంది.ప్రస్తుతం కరోనాని నియంత్రించడానికి కేవలం స్వీయ జాగ్రత్తలు తప్ప ఎలాంటి ప్రత్యామ్నాయం లేదు.
ఇలాంటి సమయంలో ఇప్పుడు ప్రజలని స్వీయ నియంత్రణలో ఉండేలా చర్యలు తీసుకునే పోలీసులే కరోనా బారిన పడటం, అలాగే కరోనా రోగులకి ట్రీట్మెంట్ అందించే వైద్యులు కూడా కరోనాతో చనిపోతూ ఉండటం ఒకింత కలవరానికి గురి చేస్తుంది.ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో కరోనా కోసం విధులు నిర్వహించడానికి ఎవరూ కూడా ముందుకి వచ్చే అవకాశం ఉండదు.
అయితే ప్రస్తుతానికి ప్రాణాలని సైతం లెక్కచేయకుండా డాక్టర్లు, పోలీసులు కరోనా విధులు నిర్వహిస్తున్నారు.ఈ కారణంగా వారు కూడా కరోనా బారిన పడుతున్నారు.
ఏపీ పోలీసుల్లోనూ కరోనా వ్యాప్తి ఎక్కువగా కనిపిస్తుంది.ఇప్పటివరకు 470 మంది పోలీసులు కరోనా బారినపడ్డారని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు.విశాఖపట్నంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన మాట్లాడుతూ, ఇతర రాష్ట్రాలతో పోల్చితే మన రాష్ట్రంలో తక్కువ కేసులు ఉన్నాయని వివరించారు.రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటోందని స్పష్టం చేశారు.
విశాఖలో 13 మంది పోలీసులకు కరోనా వచ్చిందని తెలిపారు.కరోనా ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని, 55 ఏళ్లు పైబడిన వారికి సాధారణ విధులు కేటాయిస్తున్నామని, ఆరోగ్య సమస్యలు ఉన్నవారిని కరోనా విధులకు పంపడం లేదని స్పష్టం చేశారు.
ఎలాంటి పరిస్థితిలో అయిన పోలీసులు మాత్రం విధి నిర్వహణలో ముందడుగు వేస్తారని ప్రజలకి ధైర్యం చెప్పారు.