ఏపీ పోలీస్ శాఖలో 2723 కానిస్టేబుళ్ల భర్తీకి సోమవారం (నవంబర్ 12) సాయంత్రం నోటిఫికేషన్ విడుదలైంది.ఈ నోటిఫికేషన్ ద్వారా సివిల్, ఏఆర్, ఏపీఎస్పీ, ఫైర్మెన్, వార్డర్స్ కేటగిరిలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు భర్తీ చేయనున్నారు.
అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు చివరి తేది డిసెంబర్ 7.రిజిస్ట్రేషన్ నేటి నుంచే ప్రారంభమైంది.జనవరి 6న రాత పరీక్ష నిర్వహించనున్నారు.
ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిబ్రవరి రెండో వారంలో దేహ దారుఢ్య పరీక్ష నిర్వహిస్తారు.వీరిలో అర్హత సాధించిన అభ్యర్థులకు తుది రాత పరీక్ష నిర్వహిస్తారు.
మార్చి నెల మొదటి వారంలో అంతిమ రాత పరీక్ష నిర్వహించనున్నట్లు డీజీపీ ఠాకూర్ వెల్లడించారు.వయో పరిమితి పెంచే విషయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఆయన తెలిపారు.పరీక్ష ఫలితాలను మార్చి నెలాఖరుకు విడుదల చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు డీజీపీ చెప్పారు.ఇంటర్మీడియెట్ తత్సమాన విద్యార్హత ఉన్న వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.2018 జూలై 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారు అర్హులు.దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ ముగిసిన అనంతరం అర్హులైన అభ్యర్థులకు ఆన్లైన్లో హాల్ టికెట్లను జారీ చేస్తారు.
ప్రాథమిక పరీక్ష 100 మార్కులకు ఉంటుంది.గతానికి భిన్నంగా తొలుత రాత పరీక్షను నిర్వహించి, అర్హులను దేహదారుఢ్య పరీక్షలకు ఎంపిక చేసే పద్ధతి పాటిస్తున్నారు.కొత్తగా 5 కిలోమీటర్ల రన్నింగ్ రద్దు, క్వాలిఫయింగ్ ఈవెంట్స్ను 5 నుంచి మూడింటికి పరిమితం చేయడం లాంటి సంస్కరణలు చేపట్టిన విషయం తెలిసిందే.ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియలో ఇదే విధానం అనుసరించనున్నారు.
ముఖ్యమైన తేదీలు.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు చివరి తేది: డిసెంబర్ 7
ప్రిలిమినరీ రాత పరీక్ష: జనవరి 6 .