వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరు చెబితే ఒకప్పుడు క్రమశిక్షణకు మారుపేరు అన్నట్టుగా పరిస్థితి ఉండేది.నేతలు ఎవరూ జగన్ గీసిన గీత దాటకుండా, ఎంతో వినయ విధేయతను ప్రదర్శిస్తూ, పూర్తిగా క్రమశిక్షణ కలిగిన సైనికుల్లా పనిచేస్తూ ఉండేవారు.
పార్టీలోని నాయకులు అందరూ సమిష్టిగా పనిచేస్తూ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే అంశంపైనే దృష్టిపెడుతూ ఉండేవారు.అయితే ఇప్పుడు దానికి భిన్నమైన వాతావరణం పార్టీలో నెలకొంది.
వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత పరిస్థితులు మారిపోయాయి.ఎక్కడికక్కడ అసంతృప్తులు పెరిగిపోయాయి.
వైసీపీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ పెరిగిపోయినట్టుగా, ఎక్కడికక్కడ గ్రూపు రాజకీయాలు పెరిగిపోయాయి.
ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం రిపబ్లిక్ టీవీ లో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనం వెలువడడం పెద్ద దుమారమే రేపింది.
వైసీపీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఏర్పడుతోందని, అనేక అక్రమాస్తుల కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న జగన్ జైలుకు వెళ్లే అవకాశం ఉందనే అభిప్రాయంతో, సీఎం పదవి పై చాలామంది నాయకులు కన్నేశారు అన్నట్లుగా ఆ కథనంలో లో పేర్కొనడం పెద్ద దుమారానికి కారణం అయ్యింది.ఈ వ్యవహారంపై వైసీపీలో తీవ్రస్థాయిలో చర్చ జరిగింది.
అలాగే ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకు వచ్చి మరీ రిపబ్లిక్ టివి కథనం ను ఖండించారు.ఈ వ్యవహారం ముగిసిపోయింది అనుకుంటున్న సమయంలో తాజాగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
టిడిపిని విమర్శించే క్రమంలో తానే ముఖ్యమంత్రి అయి ఉంటే.అంటూ వేసిన డైలాగ్ ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.సీఎం గా ఉన్నది జగన్మోహన్ రెడ్డి కాబట్టి టిడిపి లోని కొంతమంది ఎమ్మెల్యేలను లాగలేకపోయారని, అదే తాను ముఖ్యమంత్రి అయి ఉంటే చంద్రబాబు మినహా మిగతా వారందరినీ వైసీపీలో చేర్చుకునే వాడిని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఏదో ఉదాహరణలు చెప్పేందుకు పెద్దిరెడ్డి తానే సీఎం అయితే అంటూ డైలాగ్ వేశారు కానీ, ఇదే డైలాగ్ మరో నేత ఎవరైనా వైసీపీలో వేసుంటే రియాక్షన్ వేరేగా వచ్చేది.
అసలు జగన్ కాకుండా, వైసిపిలో సీఎం వేరొకరు అనేది ఊహించుకోవడానికి కూడా ఆ పార్టీ నేతలు భయపడతారు.కానీ పెద్దిరెడ్డి మాత్రం ఈ డైలాగ్ వేసి కొత్త చర్చకు తెరతీశారు.
మంత్రి పెద్దిరెడ్డి కానీ , ఆయన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి కి కానీ జగన్ ఇచ్చే ప్రయారిటీ చాలా ఎక్కువ.ఆ చనువు తో ఈ వ్యాఖ్యలు చేశారా ? లేక నిజంగానే రిపబ్లిక్ టీవీలో వచ్చిన కథనం లో వాస్తవం ఉందా అనే చర్చ ఇప్పుడు వైసీపీలోకి నడుస్తోంది.