రాజకీయ ప్రత్యర్థులను ఎప్పుడూ పొలిటికల్ ర్యాగింగ్ చేయడంలో ముందుంటారు ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని.జగన్ కానీ, వైసిపి ప్రభుత్వాన్ని కానీ, ఎవరైనా విమర్శిస్తే, నాని ఆషామాషీగా వదిలిపెట్టరు.
వారిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ, వారిని కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు.ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ , మాజీ మంత్రి దేవినేని ఉమా, ఇలా ఎవరిని వదిలిపెట్టకుండా విమర్శలు చేస్తూ ఉంటారు.
అందుకే వీలైనంత వరకు నాని తో పెట్టుకునేందుకు ఎవరు సాహసించరు.
ఇదిలా ఉంటే, ప్రత్యర్థుల పైనే కాకుండా, ఇప్పుడు సహచర మంత్రుల పైన నాని పంచ్ డైలాగ్ లు వేస్తూ, కామెంట్స్ చేస్తుండటం వైరల్ గా మారింది.
తాజాగా ఏపీ కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం మంత్రుల మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది.ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని, పశ్చిమ గోదావరి జిల్లా డెల్టా ప్రాంతానికి చెందిన ఓ మంత్రి పై నాని సెటైర్లు వేశారు.
దీంతో తిరిగి ఆ మంత్రి సైతం అంతే స్థాయిలో నాని పై సెటైర్లు వేయడం , ఇదంతా మీడియా ముందే జరగడం వైరల్ అయ్యింది.జగన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నాడు నేడు కార్యక్రమాలపై జగన్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా సుమారు ఎనిమిది మంది వరకు మంత్రులు హాజరయ్యారు.ఈ సమావేశం ముగిసిన అనంతరం సదరు మంత్రి ని ఉద్దేశించి నాని … మీరు పని ఉన్నా లేకపోయినా నియోజకవర్గంలో పర్యటిస్తున్నరట కదా అంటూ వ్యాఖ్యానించడంతో, సదరు మంత్రి స్పందించే లోపే అదే జిల్లాకు చెందిన మరో మంత్రి ఈ వ్యవహారం పై స్పందిస్తూ, ఈయన ఎప్పుడు ఇంతే అన్న, వద్దన్నా వినకుండా నియోజకవర్గాలు పట్టుకుని వేలాడుతున్నారు అంటూ చెప్పడంతో, సదరు మంత్రి సీరియస్ గానే స్పందించారట.
చూడు తమ్ముడు తిరిగే కాలు, తిట్టే నోరు ఊరుకోదు.నువ్వేమో టిడిపి అంటే నోరు పారేసుకుంటున్నావ్ .నేనేమో నియోజకవర్గాల అంటే కాలు పారేసుకుంటున్నా.ఏం చేస్తాం కొన్ని జీవితాలు అంతే మారవు అని చెప్పి, కిళ్లీ నోట్లో వేసుకున్నాడట సదరు మంత్రి.
అయితే ఇదంతా మీడియా ముందు చోటు చేసుకోవడంతో ఈ వ్యవహారం వైసీపీ లో హాట్ టాపిక్ గా మారింది.గతంలోనే సదరు మంత్రి వ్యవహారశైలిపై కొడాలి నాని అభ్యంతరం వ్యక్తం చేస్తూ, అనేక సార్లు జగన్ కు సైతం ఫిర్యాదు చేశారు తన శాఖకు సంబంధించిన విషయాలలో సదరు మంత్రి జోక్యం చేసుకుంటున్నారని ఫిర్యాదులు చేశారు.
దీంతో సదరు మంత్రి కి వార్నింగ్ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది.ఇప్పుడు బహిరంగంగానే ఇలా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.