ఈరోజు సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన సీబీఎస్ఈ ఇంటర్ పరీక్షలను మాత్రం వాయిదా వేసింది.
సీబీఎస్ఈ పరీక్షలు వాయిదా పడటంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో కూడా పదో తరగతి పరీక్షలు రద్దయ్యే అవకాశం ఉందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.గతేడాది తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలు రద్దైన సంగతి తెలిసిందే.
అయితే ఏపీలో పదో తరగతి పరీక్షలకు సంబంధించి గాసిప్స్ వైరల్ అవుతుండటంతో ఏపీ విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించి వివరణ ఇచ్చారు.రాష్ట్రంలో పరీక్షలు రద్దు చేసే అవకాశం లేదని మంత్రి తేల్చి చెప్పారు.
రాష్ట్ర విద్యాశాఖ ఇప్పటికే పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ను ప్రకటించగా ఆ షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు జరుగుతాయని మంత్రి తెలిపారు.కరోనా కేసులు మరింత పెరిగితే పరీక్షల విషయంలో ఆలోచిస్తామని అన్నారు.
రాష్ట్రంలో పరీక్షల నిర్వహణ గురించి సీఎం జగన్ తో చర్చిస్తామని మంత్రి వెల్లడించారు.పాఠశాలలు తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని నిబంధనలు పాటించని పాఠశాలల విషయంలో చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు.
మరోవైపు ఏపీలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి.గతేడాది ఏపీలో ఒక దశలో 10,000 కేసులు నమోదైన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం రాష్ట్రంలో 4,000కు అటూఇటుగా కేసులు నమోదవుతున్నాయి.రాబోయే రోజుల్లో కేసులు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.కరోనా కొత్త కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరగకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది.దేశంలో ప్రస్తుతం రెండు లక్షలకు చేరువలో కేసులు నమోదవుతూ ఉండగా రాబోయే రోజుల్లో కేసులు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని రోజుకు మూడు లక్షల కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది.