లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి బయటకు వచ్చిన వారిని సెల్ఫీలు దిగాలి అంటూ పోలీసులు ప్రోత్సహిస్తున్నారు.బయటకు వస్తే సెల్ఫీలు దిగడం ఏంటి అది కూడా పోలీసులు ప్రోత్సహించడం ఏంటి అని అనుకుంటున్నారా.
కరోనా మహమ్మారి నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో గుంటూరు జిల్లా లో కూడా ఈ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్ డౌన్ ను కట్టుదిట్టంగా అక్కడ అమలు చేస్తున్నారు.
ప్రజలు ఎవరూ కూడా అనవసరంగా బయటకు రావొద్దు అంటూ ఎన్నిసార్లు పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ ప్రజలు మాత్రం ఏ లక్ష్య పెట్టకుండా బయటకు వస్తూ పెద్ద తలనొప్పులు తీసుకువస్తున్నారు.అయితే ఇలాంటి వారికి గుంటూరు పోలీసులు వైరైటీ శిక్షలు వేస్తూ వాళ్లు రోడ్ల మీదకు రాకుండా ఉండేలా చర్యలు చేపట్టారు.
“నేను మూర్ఖుడిని.నేను మాస్క్ పెట్టుకొను.
పని పాట లేకుండా రోడ్ల మీద తిరిగి కరోనా వైరస్ వ్యాప్తి చేస్తాను.ప్రజల ప్రాణాలతో ఆడుకుంటాను”.
ఈ రకమైన కామెంట్స్తో ఓ బోర్డు ఏర్పాటు చేయించి దాన్ని సెల్ఫీ పాయింట్గా మార్చేశారు.ఎవరైతే అనవసరంగా రోడ్ల మీదకు వచ్చి నిర్లక్ష్యంగా వ్యవహిస్తున్నారో వారిని ఇక్కడకు తీసుకొచ్చి సెల్ఫీ తీయిస్తున్నారు.
అంతేకాదు ఆ ఫోటోను వారి ఫోన్లో వాట్స్ యాప్ డిపిగా, తమ సొంత సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేయిస్తూ వినూత్న శిక్ష విధిస్తున్నారు.ఈ రకంగా అయిన కొందరు మారతారని పోలీసులు భావిస్తున్నారు.
గుంటూరు రూరల్కు సంబంధించిన కొల్లూరు పోలీసులు ఈ రకమైన వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టి ఇలాంటి శిక్షలు విధిస్తున్నారట.మొత్తానికి కరోనా వైరస్ వ్యాపిస్తున్న సందర్భముగా లాక్ డౌన్ నిబంధనలు పాటించకుండా ఇలా రోడ్ల పైకి వచ్చేవారికి ఇలాంటి వినూత్నమైన శిక్షలు విధిస్తుండడం తో జనాలు కూడా రోడ్లపైకి రావడానికి భయపడుతున్నారు.
ఇటీవల విజయవాడ లో కూడా ఇలా రోడ్లపైకి వచ్చిన వారికి రామ కోటి స్టైల్ లో “తప్పైపోయింది,క్షమించండి” అంటూ 500 సార్లు రాయాలి అంటూ వినూత్న శిక్షలు విధిస్తున్న విషయం తెలిసిందే.