రాబోయే రోజులను ఊహించుకుంటేనే భయమేస్తోంది.ప్రతి ఒక్కరిలోనూ ఆందోళన కనిపిస్తోంది.
ఈ కరోనా మహమ్మారి ముందు ముందు ఏ స్థాయిలో ఉంటుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది.అన్ని దేశాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది.
మన దేశంలోనూ కరోనా ప్రమాదకర స్థితిలో ఉండడమే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా భారతదేశం మూడో స్థానంలో నిలుస్తోంది.ఇదే స్పీడ్ కొనసాగితే రెండో స్థానానికి చేరుకోవడానికి మరెంతోకాలం పట్టేలా కనిపించడం లేదు.
ఇక మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, తెలంగాణ, పంజాబ్ వంటి రాష్ట్రాల్లోనూ ఈ ఉధృతి ఎక్కువగానే ఉంది.కొద్ది రోజులుగా ఏపీలోనూ కేసుల సంఖ్య ఎక్కువగా బయటపడుతున్నాయి.
కరోనా నిర్ధారణ పరీక్షలు ఎక్కువగా చేస్తుండడంతో, ఈ కేసులు బయటపడుతున్నాయి.
ఏపీలో సామాజిక వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్లు వైద్య వర్గాలు ధృవీకరిస్తున్నాయి.
ప్రస్తుతం ఎక్కడికక్కడ షాపులు, ఆఫీసులు, స్వచ్ఛందంగా మూసివేస్తూ, పరిమితవేళల్లో మాత్రమే తెరుస్తూ కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తున్నారు.అయినా పరిస్థితి అదుపులోకి వచ్చేలా కనిపించకపోవడంతో, ఏపీలో రెండు వారాల పాటు సంపూర్ణ లాక్ డౌన్ విధించాలనే డిమాండ్ పెరిగిపోతోంది.
ప్రస్తుతం ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతుండడం ఒక ఎత్తయితే, మరణాల శాతం పెరుగుతున్న తీరు ప్రభుత్వ వర్గాలను కూడా భయాందోళనకు గురి చేస్తోంది.ఒక్కసారిగా ఈ విధంగా భారీగా కేసులు పెరగడానికి కారణాలు ఏంటనే విషయంపైనా, ప్రభుత్వం దృష్టి పెట్టి, నివారణ చర్యలకు పూనుకుంది.
కొద్ది రోజులుగా ఏపీకి వలసలు భారీగా పెరుగుతుండడంతోనే కేసులు నమోదు అవుతున్నాయని ప్రభుత్వ అధికారులు చెబుతున్న మాట.అందుకే కొన్ని వారాల పాటు లాక్ డౌన్ విధించాలనే ఒత్తిడి జగన్ పై ఎక్కువగా వస్తున్నట్లు తెలుస్తోంది.ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఈ ప్రతిపాదన ను జగన్ కు సూచించినట్లు సమాచారం.ఈ విషయంపై ప్రభుత్వం కూడా సీరియస్ గానే దృష్టి పెట్టింది.
ఒకటి రెండు రోజుల్లో ఈ వ్యవహారంలో ఏం చేయాలనే దానిపై సీరియస్ గానే దృష్టి పెట్టి, ఈ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వం భావిస్తోంది.అయితే లాక్ డౌన్ విధించడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని, ఎలాగూ వైరస్ ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తరఫున సమర్థవంతంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామనే అభిప్రాయంలో జగన్ ఉన్నారట.
కాకపోతే రెండు వారాలపాటు లాక్ డౌన్ విడిస్తే కాస్త ఊరట లభిస్తుందని అధికార వర్గాలు జగన్ కు సూచిస్తున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుత పరిస్థితుల్లో లాక్ డౌన్ విధిస్తే, ఆర్థికంగా రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందని, ఇప్పటికే కోలుకోని విధంగా కష్టనష్టాలను ఎదుర్కొంటున్నామనే అభిప్రాయం జగన్ లో ఉంది.కాకపోతే పరిస్థితి చేయి దాటి పోయే విధంగా ఉండడం, అధికారుల నుంచి తీవ్రస్థాయిలో ఒత్తిడి వస్తుండటంతో, మరో రెండు రోజుల్లో ఈ వ్యవహారంలో క్లారిటీ ఇచ్చేందుకు జగన్ సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది.