చాలా కాలంగా జనసేన పార్టీలో ఒక అంతర్యుద్ధం జరుగుతోంది.ముఖ్యంగా పవన్ తరువాత ఆ స్థాయిలో ప్రాధాన్యం పొందుతున్న ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తీరుపై జనసేన నేతల్లో తీవ్ర అసంతృప్తి ఎప్పటి నుంచో ఉంది.
మనోహర్ పెత్తనం పార్టీలో ఎక్కువైందని, ఆయన తప్ప మరెవరికి ప్రాధాన్యం దక్కకుండా చేస్తున్నారని , ఆయన తీరుతో ఇప్పటి వరకు ఎంతో మంది పార్టీని వీడి బయటకు వెళ్లిపోయారు అనే ప్రచారం జరుగుతోంది.అసలు కాపులు ఎక్కువగా ఉండే జనసేన లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన మనోహర్ పెత్తనాన్ని మెజారిటీ నాయకులు ఒప్పుకోవడం లేదు.
దీనికి తగ్గట్టుగానే ఆయన వ్యవహారశైలి ఉంటోందట.ఇప్పటికే పార్టీ నుంచి వెళ్లిపోయిన ఎంతో మంది నేతలు నాదెండ్ల మనోహర్ పైన విమర్శలు చేశారు.
పార్టీలో ఉన్న నాయకుల్లో నూ ఇదే విషయంపై అసంతృప్తి ఉంది.
ఇటీవల సీనియర్ రాజకీయ నాయకుడు, కాపు నేత అయిన మాదాసు గంగాధరం జనసేన ను వీడి బయటకు వెళ్ళిన సమయంలో పవన్ కు రాసిన లేఖలో మనోహర్ పైన విమర్శలు చేసినట్లు తెలుస్తోంది.
ఆయన వ్యవహార శైలి కారణంగా జనసేన లోని నాయకులకు మనోహర్ కు మధ్య బాగా దూరం పెరిగిందనే విషయం పవన్ వరకు వెళ్ళింది.అయితే రాబోయే ఎన్నికల దృష్ట్యా నాదెండ్ల మనోహర్ వంటి సీనియర్ నాయకుల అవసరం ఎంతైనా ఉందని పవన్ అభిప్రాయపడుతున్నారు.
నాయకులు చేస్తున్న రీతిలో మనోహర్ పార్టీకి నష్టం ఏమీ చేయడం లేదని పవన్ నమ్ముతున్నారు.
అందుకే నాదెండ్ల పై ఉన్న అసంతృప్తి పోగొట్టి, ప్రస్తుతం జనసేన లో ఉన్న కమిటీలలో మార్పు చేర్పులు చేసి కీలకంగా వ్యవహరించే వారిని మరింత యాక్టివ్ చేయాలని , పార్టీ నేతల్లో నాదెండ్ల మనోహర్ పై ఉన్న అపోహలను తొలగించి, కీలక బాధ్యతలు అప్పగించాలనే ఆలోచనలో పవన్ ఉన్నారట.అయితే నాదెండ్ల మనోహర్ పెత్తనాన్ని మాత్రం జనసేన లోని చాలామందే అంగీకరించే పరిస్థితుల్లో లేరట.