ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుండి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, ప్రజలకు చేరువయ్యే క్రమంలో సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఈ నేపథ్యంలో కొన్ని నిర్ణయాలు అమలు చేసే ప్రక్రియలో న్యాయ సంబంధమైన అంశాలు కావడం, ఆ విషయాలు న్యాయస్థానం పరిధిలో ఉండడం వల్ల ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, పరిపాలన విధానానికి సంబంధించిన విషయాలు న్యాయ స్థానాల పరిధిలో ఉండడంతో కొన్ని కార్యక్రమాలు వాయిదా పడుతూ వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో తరచుగా న్యాయస్థానాల్లో రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తరచుగా చిక్కెదురు కావడం గమనార్హం.
ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు మరోసారి తీవ్రంగా హెచ్చరించింది.
న్యాయవ్యవస్థపై నమ్మకం లేదా అలా అయితే పార్లమెంట్ కు వెళ్లి ఏపీ హైకోర్టును మూసేయమని అడగండి అంటూ తీవ్ర వ్యాఖ్యలతో మండిపడింది. రూల్ ఆఫ్ లా సరిగ్గా అమలు కాకుంటే ఇతర అధికారాన్ని వినియోగిస్తామని ఏపీ ప్రభుత్వాన్ని హై కోర్టు హెచ్చరించింది.
న్యాయవ్యవస్థ ప్రతిష్టను దిగజార్చడాన్ని సహించబోమని హైకోర్టు తేల్చిచెప్పింది.హైకోర్టు పైనే వివాదాస్పద వ్యాఖ్యలా? అంటూ తీవ్రంగా ప్రశ్నించింది.జుడిషియల్ స్తంభం బలహీనమైతే “సివిల్ వార్ “కు అవకాశముంటుందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. జడ్జీల పై ఆరోపణలతో హైకోర్టే పిటిషన్ వేసుకోవాల్సి వచ్చిందని, ఇలాంటి పరిస్థితి ఎప్పుడు రాలేదని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
దీని వెనుక కుట్ర ఉందేమో తేలుస్తామని హైకోర్టు తెలిపింది.