తెలుగుదేశం పార్టీలో ఊహించని పరిణామాలు ఎన్నో చోటు చేసుకుంటున్నాయి.ఇప్పటికే పుట్టెడు కష్టాల్లో ఉన్న పార్టీని ముందుకు తీసుకు వెళుతూ, పార్టీ నేతల్లో ఉత్కంఠ రేకెత్తించే విధంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు.
అడుగడుగున వైసీపీ, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తప్పుపడుతూ, ప్రజల్లోనూ, పార్టీ నాయకుల్లోనూ ఉత్సాహం పెంచే విధంగా ప్రయత్నిస్తున్నారు.ఇప్పుడిప్పుడే తెలుగుదేశం పార్టీకి కాస్త ఆదరణ పెరుగుతుంది అనుకుంటున్న సమయంలో, అకస్మాత్తుగా టిడిపి నాయకులను వైసీపీ ప్రభుత్వం టార్గెట్ చేసుకుని అరెస్ట్ చేయిస్తుండడం వంటి పరిణామాలు చంద్రబాబుకు, ఆ పార్టీ నేతలకు మింగుడు పడడం లేదు.
గత టిడిపి ప్రభుత్వంలో కాస్త హవా చూపించిన కీలక నాయకులందరూ, ఒక్కొక్కరుగా జైలుకు వెళుతుండటం, గత ప్రభుత్వ హయాంలో నెలకొన్న అవినీతి వ్యవహారాలు అన్నింటిని, వైసీపీ ప్రభుత్వం తవ్వి తీస్తుండడం వంటి పరిణామాలు తెలుగుదేశం నేతల్లో మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.
దీంతో క్షేత్ర స్థాయిలో ప్రభుత్వంపై పోరాటం చేయాలంటే ముందుకు వచ్చేందుకు నాయకులు భయపడిపోతున్నారు.
ప్రభుత్వం ఎక్కడ తమను టార్గెట్ చేసుకుంటుందో అనే భయం వారిలో ఎక్కువగా కనిపిస్తోంది.దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇప్పటికే అరెస్టు కాగా, విశాఖ జిల్లా నాయకుడు మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు వంటి వారిపై కేసులు నమోదయ్యాయి.
వీరితో పాటు గుంటూరు జిల్లాకు చెందిన యరపతినేని శ్రీనివాసరావు, యనమల రామకృష్ణుడు, చినరాజప్ప, అఖిలప్రియ, కేఈ కృష్ణమూర్తి కుటుంబ సభ్యులు ఇలా చాలా మందిపైన కేసులు నమోదయ్యాయి.
వీరందరిని ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశం కనిపిస్తుండడంతో, తెలుగుదేశం పార్టీలో ఆందోళన పెరిగిపోతోంది.
మరి ముఖ్యంగా మాజీ మంత్రులు చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా పేరుపడిన దేవినేని ఉమా, పత్తిపాటి పుల్లారావు, నారాయణ తో పాటు పితాని సత్యనారాయణ, అలాగే చంద్రబాబు తనయుడు నారా లోకేష్ అతి త్వరలోనే అరెస్ట్ కాబోతున్నట్లు అధికార పార్టీ నుంచి లీకులు బయటకి వస్తుండటంతో, తెలుగుదేశం నాయకుల్లో ఆందోళన మరింతగా పెరిగిపోతోంది.ఏ క్షణంలో, ఏ నేత అరెస్ట్ అవుతారో తెలియక నాయకులంతా భయం భయంగా గడుపుతున్నారు.