ఏ విషయాన్ని అయినా మొహమాటం లేకుండా మాట్లాడటం తెలంగాణ సీఎం కేసిఆర్ స్టైల్.ఎంతటి విపత్కర పరిస్థితులనైనా చాకచక్యంగా ఎదుర్కొంటూ ముందుకు వెళుతుంటారు.కేసీఆర్ తో స్నేహమైన, శత్రుత్వం ఏదైనా ఇలాగే ఉంటుంది.తమ ఉమ్మడి శత్రువు టిడిపి అధినేత చంద్రబాబును ఎదుర్కునేందుకు ఏపీలోని వైసీపీకి కేసీఆర్ పూర్తిగా మద్దతుగా నిలుస్తున్నారు.
జగన్ అధికారంలోకి వచ్చేందుకు కూడా పరోక్షంగా కెసిఆర్ సహకారం అందించారు.ఇక ఏపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రల్లో జటిలమైన సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తున్నారు.
తాజాగా కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ఏపీ మధ్య వార్ మొదలైంది.తెలంగాణలోని విపక్ష పార్టీలు ఏకమై ఏపీ ప్రభుత్వం, టిఆర్ఎస్ ప్రభుత్వం పైన తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నాయి.
ఇదే విషయమై రెండు రోజుల క్రితం స్పందించిన కెసిఆర్ తెలంగాణకు ఆంధ్రా కు మధ్య ఎటువంటి విభేదాలు లేవని, ఏవైనా సమస్యలు వస్థే జగన్ అనే నేను పరిష్కరించుకుంటాము అని ప్రకటించారు.ప్రతిపక్షాలు రాజకీయ కక్షతోనే జగన్ కు నాకు మధ్య విభేదాలు సృష్టించాలని చూస్తున్నాయి అంటూ మండిపడిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ తీరును సుతిమెత్తగా కేసీఆర్ విమర్శించారు.గోదావరి మిగులు జలాలను రాయలసీమకు తరలించుకుని వెళ్లాలని గతంలో తాను సూచించానని, కానీ జగన్ కృష్ణా జలాల విషయంలో ఈ విధంగా వ్యవహరించడం తగదని కేసీఆర్ చెప్పుకొచ్చారు.
తనకు తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యం అంటూ విపక్షాల నోటికి తాళం వేశారు.
ఈ విధంగా సమయస్ఫూర్తితో కేసీఆర్ వ్యవహరించారు.అయితే ఏపీ సీఎం జగన్ మాత్రం కేసీఆర్ చెబుతున్న దానికి విరుద్ధంగా వ్యవహరిస్తుండడంతో కేసీఆర్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది.పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకం విషయంలో కృష్ణ బోర్డు కు ఏపీ ప్రభుత్వం రాసిన లేక ఇప్పుడు కేసీఆర్ కు ఆగ్రహం కలిగిస్తోంది.
తెలంగాణలో చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి, డిండి, భక్త రామదాసు, మిషన్ కాకతీయ, తుమ్మిళ్ల వంటి ప్రాజెక్టులతో పాటు, సామర్థ్యాన్ని పెంచిన కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్ ఎల్ బి సి వంటి ప్రాజెక్టుల పైన ఫిర్యాదు చేసింది.ఏపీ ప్రభుత్వం చేసిన ఫిర్యాదులపై కృష్ణ బోర్డ్ స్పందించి దీనిపై తెలంగాణ ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సిందిగా కోరింది.
అలాగే ఏపీ ప్రభుత్వం లేవనెత్తిన సందేహాలకు సమాధానం కూడా ఇవ్వాలంటూ కృష్ణా బోర్డు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.అయితే సామరస్యపూర్వకంగా సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ముందుకు వెళ్దామని తాము చూస్తుంటే జగన్ ప్రభుత్వం మాత్రం వివాదం పెట్టుకునే దిశగా ముందుకు వెళ్లడం కెసిఆర్ కు ఆగ్రహం కలిగిస్తోంది .అందుకే ఇకపై ఏపీ విషయంలో మెతకవైఖరి తో ఉండకూడదని కేసీఆర్ నిశ్చయించుకున్నట్లు సమాచారం.