నిన్న, మొన్నటి వరకూ ఆంధ్ర ప్రదేశ్ రాజధాని హైదరాబాద్ కాబట్టి ప్రతీ పనికి హైదరాబాద్ వెళ్ళడం అలవాటైపోయింది.చదువు పూర్తి అయ్యింది అంటే చాలు హైదరాబాద్ వెళ్ళి జాబ్ వేట మొదలుపెట్టాలి.
వ్యాపారం చెయ్యాలన్నా హైదరాబాద్ లో పెడితే బావుంటుంది అని ఇలా ఎంతో మంది ఎన్నో రకాలుగా హైదరాబాద్ పై మమకారం పెంచుకుని హైదరాబాదీయులుగా మారిపోయారు.ఇంత వరకూ బాగానే ఉన్నా ఇప్పుడు చిక్కల్లా హైదరాబాద్ లో ఉండే వారి ర్యాషన్ కార్డ్స్ విషయమే.
ఎందుకంటే అలా ఉంటున్న వారిలో ఎక్కువ మందికి ఇక్కడ హైదరాబాద్ లోనూ, అక్కడ ఆంధ్రాలోనూ రెండు చోట్లా రేషన్ కార్డ్స్ ఉన్నాయి.అందుకే అలాంటి కార్డులకు మంగళం పాడేయాలని చంద్రబాబు సర్కారు ప్లాన్ చేస్తోంది.
బోగస్ కార్డుల ఏరివేతపై దృష్టి పెట్టిన ఏపీ సర్కారు ఇలాంటి డబల్ కార్డు హోల్డర్లను గుర్తించి, చెక్ పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది.వీరిని గుర్తించేందుకు ఆధార్ కార్డును అస్త్రంగా వాడుకోబోతున్నారు.
ఆధార్ కార్డులోని చిరునామాలోనే వీరికి కార్డు ఉంటుంది.రెండోచోట ఇక కార్డుపై ఆశలు వదులుకోవాల్సిందే.
ఇక ఇప్పటికే కేసీఆర్ సర్కార్ బోగస్ కార్డులను పెద్ద సంఖ్యలో ఏరి వేసిన సంగతి తెలిసిందే.అదే బాటల చంద్రబాబు సైతం పయనించి అనర్హత కార్డులకు చరమ గీతం పాడాలని చూస్తున్నాడు.