ప్రజల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని .అందుకే వారికోసం అనేక ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని కాబట్టి ప్రజల్లో తెలుగుదేశం పై అభిమానం బాగా పెరిగిందని రాబోయే ఎన్నికల్లో టీడీపీ విజయానికి ఇదే దోహదం చేస్తుందని చంద్రబాబు అండ్ కో బృందం ఆలోచన చేస్తోంది.
ఈ పధకాల కోసం ఇప్పటికే కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారు.కానీ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఈ పధకాలు చాలా వరకు ప్రజల్లోకి వెళ్లడం లేదని… ఇదే టీడీపీ ఎన్నికల్లో టీడీపీ కొంప ముంచబోతోందని తెలుస్తోంది.
గ్రామాల్లో సర్పంచుల వ్యవస్థను నిర్వీర్యం చేసేలా టీడీపీ ఏర్పాటు చేసిన జన్మభూమి కమిటీలు అవినీతికి అడ్డాగా మారిపోయాయి.గ్రామాల్లో వీరి జోక్యం మితిమీరిపోయాయి.ప్రతిపనికీ ఒక రేటు కట్టడం.తమకు నచ్చినవారికే వివిధ పధకాలు మంజూరు చేస్తూ మిగిలిన ప్రజల ఆగ్రహానికి కారణం అవుతున్నాయి.
దీంతో ఆ కమిటీలను రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
ఇక సంక్షేమ పధకాలు కూడా ప్రజలకు చేరింది తక్కువే.ఎస్సీ సంక్షేమ పథకాలు బినామీల పాలవుతున్నాయి.ఎస్సీ యువత స్వయం ఉపాధి కోసం కార్ల కొనుగోలు పథకం ప్రభుత్వం చేపట్టింది.
అయితే, ఇవి ఎస్సీల పేరుతో పలువురు ఎమ్మెల్యేల బంధువులు, మంత్రుల బంధువుల వద్దకు చేరాయి.భూమి కొనుగోలు పథకాన్ని అమలుచేసినట్లు ప్రభుత్వం అబద్ధపు ప్రచారం చేసుకుంటోంది.రూ.200 కోట్లతో 4333 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి భూమిలేని మహిళా వ్యవసాయ కూలీలకు 75శాతం సబ్సిడీపై ఇచ్చినట్లు ప్రకటించింది.కానీ, నాలుగేళ్లలో ఇప్పటివరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు.ఇక ఫీజు రీయింబర్స్మెంట్ విషయానికి వస్తే మొత్తం రూ.2,500కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఇంకా రూ.800కోట్లు బకాయి ఉన్నారు.మైనార్టీలకు రూ.500 కోట్లకు మించి ఖర్చుపెట్టింది లేదు.
బీసీల్లో కుల వృత్తుల వారికి ఇస్తామన్న ఆదరణ పనిముట్లు ఇప్పటివరకూ ఇవ్వలేదు.రాష్ట్రంలో రెండున్నర కోట్ల మంది బీసీలు ఉంటే ఏటా రుణాలు ఇచ్చేందుకు 50వేల మందినే ఎంపిక చేస్తున్నారు.
అయినా, అందులో 25వేల మందికి కూడా ఇవ్వడంలేదు.ఆదాయ పరిమితి పెట్టడంవల్ల చాలా కుటుంబాల వారు ‘పెళ్లి కానుక’ పథకానికి దూరమవుతున్నారు.
ఇప్పటి వరకు ఈ పథకం కింద షెడ్యూల్డ్ కులాలకు చెందిన వధూవరులు 3,034 మంది దరఖాస్తు చేసుకుంటే ఒక్క జంటకు కూడా ఇప్పటివరకూ ఇవ్వలేదు.
గిరిజనులకు ఉద్దేశించిన గిరిపుత్రిక కళ్యాణ పథకానికి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5వేలకు పైగా దరఖాస్తు చేసుకున్నారు.
వీరిలో ఒక్క కొత్త జంటకు కూడా ప్రభుత్వం సాయం చేయలేదు.ముస్లింల కోసం ప్రవేశపెట్టిన దుల్హన్ పథకం కూడా అలంకారప్రాయంగా మారింది.ఒక్కరికీ ఈ పథకం లబ్ధిచేకూర్చలేదు.అలాగే, బీసీలకు ప్రభుత్వం కొత్తగా రూ.35వేలు ఇస్తామని ప్రకటించింది.వీరి విషయంలోనూ పూర్తిస్థాయిలో అమలుకాలేదు.
కులాంతర వివాహాలు చేసుకున్నా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారు మాత్రమే అర్హులని ప్రభుత్వం మెలిక పెట్టింది.
సంప్రదాయ చర్మకారుల జీవనోపాధి కోసం రూ.60 కోట్లు కేటాయించినట్లు ప్రభుత్వం చెబుతున్నా ఒక్కరికి కూడా రూపాయి ఇవ్వలేదు.మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ (ఎంబీసీ) కార్పొరేషన్ను ఏర్పాటుచేసి గత ఏడాది రూ.60 కోట్లు, ఈ సంవత్సరం రూ.100 కోట్లు కేటాయించారు.ఒక్కరికి కూడా సాయం అందించలేదు.ఇలా చెప్పుకుంటూపోతే టీడీపీ ప్రవేశపెట్టిన ఏ పధకం కూడా ప్రజలకంటే అధికార పార్టీ నేతలకే ఎక్కువ చేరాయనేది వాస్తవం.ఈ దశలో ఆ పథకాలే టీడీపీని ఆదుకుంటాయని ఆ పార్టీ నేతలు భావిస్తుండడం అత్యాశే అవుతుందేమో.