ఏపీ ప్రభుత్వం, ఏపీ ఎన్నికల కమిషన్ మధ్య గత కొంతకాలంగా వివాదం నడుస్తూనే ఉంది.స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయమై మొదటి నుంచి ఈ రెండు వ్యవస్థలకు మధ్య వివాదం చోటు చేసుకుంది.
ఈ వ్యవహారం ఒక కొలిక్కి రాకముందే ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన నోటిఫికేషన్ ను ఏపీ ఎన్నికల కమిషన్ రిలీజ్ చేయడంతో ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఫైర్ అవుతోంది.ఏకపక్షంగా ఎన్నికల కమిషన్ వ్యవహరించింది అంటూ మండిపడుతోంది.
ప్రస్తుతం ఏపీ లో నెలకొన్న పరిస్థితులు, కరోనా వైరస్ ప్రభావం ఇంకా తగ్గక ముందే ఎన్నికలు నిర్వహించడం మంచిది కాదు అనే అభిప్రాయంలో ఏపీ ప్రభుత్వం ఉంది.అదీ కాకుండా కరోనా వాక్సిన్ పంపిణీ చేపట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్న సమయంలోనే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం పై మండిపడుతోంది.
రాష్ట్రప్రభుత్వం అభ్యంతరాలపై స్పష్టమైన క్లారిటీ రాకముందు హడావుడిగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాల్సిన అవసరం ఏంటని ప్రభుత్వం ప్రశ్నిస్తోంది.ఇప్పుడు ఎన్నికల తంతును అడ్డుకునేందుకు ఏం చేయాలనే అంశంపై ప్రభుత్వ పెద్దలు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా ఎన్నికల కమిషన్ నిర్ణయం పై ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.దీనికి సంబంధించిన పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఈ విషయంలో సుప్రీం కోర్టు ఏం తీర్పు ఇస్తుంది అనే దానిని బట్టి ఎవరు పై చేయి సాధిస్తారో తేలిపోనుంది.
సుప్రీం లో పిటిషన్ వేస్తే ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ పై స్టే ఇస్తారా అనేది తేలాల్సి ఉంది.నిమ్మగడ్డ టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మొదటి నుంచి వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.గతేడాది స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన సమయంలోనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు వైసీపీ ప్రభుత్వానికి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి.
ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని టీడీపీ ఈసీకి ఫిర్యాదు చేయడం, ఆ ఫిర్యాదు ఆధారంగా చాలా చోట్ల ఎన్నికలను రద్దు చేయడం వంటి వ్యవహారాలు వైసీపీ ప్రభుత్వానికి ఆగ్రహం కలిగించాయి.
ఇక ఆ తరువాత కరోనా కేసుల వ్యవహారం ను తెరపైకి తెచ్చి స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ను రద్దు చేయడంతో ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ కు మధ్య విభేదాలు మొదలయ్యాయి.అప్పటి నుంచి ఈ వివాదాలు ఇలా ఉండగానే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అభ్యంతరాలు చెబుతున్నా ఎన్నికల నోటిఫికేషన్ ను నిమ్మగడ్డ రమేష్ కుమార్ విడుదల చేయడంతో మరోసారి రాజకీయ రచ్చగా మారే అవకాశం కనిపిస్తోంది.