ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది.కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించిన వైద్య సిబ్బందికి శుభవార్త చెప్పింది.
బోధనాస్పత్రులు, వైద్య, డెంటల్ కళాశాలల్లో పనిచేసే బోధనా వైద్యులకు రాష్ట్ర ప్రభుత్వం వేతన సవరణ చేసింది.ఈ మేరకు సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ఉత్తర్వులు మార్చి 1 నుంచి అమలులోకి వస్తాయని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.
ప్రభుత్వం తాజాగా తీసకున్న ఈ నిర్ణయంతో దాదాపు 4 వేల మంది వైద్యులకు లబ్ధి చేకూరనుంది.7వ సెంట్రల్ పే కమిషన్ ఫార్ములా ప్రకారం వేతనాలను పెంచినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.అకడమిక్ లెవెల్, సీనియార్టీని బట్టి వేతనాల పెంపు నిర్ణయించినట్టు పేర్కొన్నారు.
చివరిసారిగా 2006లో నాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో టీచింగ్ హాస్పిటల్స్ లో పని చేసే వైద్యులకు వేతన సవరణ చేస్తూ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.
ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్లీ వేతన సవరణ జరగలేదని తెలిపారు.దీంతో ఆయా వైద్య సిబ్బంది అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు.వైఎస్ జగన్ సీఎం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం వైద్యులు ఆయనను కలిసి తమ సమస్యలను విన్నవించారు.
ఈ అంశంపై సానుకూలంగా స్పందించిన సీఎం జగన్ 2021 మార్చి 1 నుంచి వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
అయితే ఏపీ రాష్ట్రంలో మొత్తం 2 డెంటల్ కళాశాలలు, 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయని తెలిపారు.
వీటిలో ట్యూటర్ నుంచి ప్రొఫెసర్ వరకు వివిధ స్థాయిల్లో దాదాపు 4 వేల మంది పని చేస్తున్నారు.ప్రభుత్వం తాజాగా తీసుకున్న వేతన సవరణ నిర్ణయంతో వీరందరికీ వేతనాలు భారీగా పెరగనున్నాయి.ఉదాహరణకు 2006 పే స్కేల్ ప్రకారం ప్రొఫెసర్ కు రూ.37,400-రూ.67 వేల వరకు వేతనాలు ఉండగ ప్రస్తుతం సవరించిన పే స్కేల్ ప్రకారం వీరి వేతనం రూ.1,44,200 నుండి రూ.2,18,200 వరకు పెరగనుంది.ప్రభుత్వ నిర్ణయంతో వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం జగన్ కు వారు ధన్యవాదాలు తెలియజేశారు.