వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అన్నీ సంచలనాల నిర్ణయాలే తీసుకుంటోంది.రికార్డు స్థాయిలో శాసన సభ్యులు ఆ పార్టీకి ఉన్నారు.
ఇక జగన్ తన మంత్రి మండలిని కూడా సరికొత్త రీతిలో సామజిక వర్గాల సమీకరణాల ఆధారంగా ఎవరూ ఊహించని వ్యక్తులకు మంత్రిపదవులు కట్టబెట్టి సరికొత్త రికార్డు సృష్టించాడు.అంతేకాదు.
దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఏపీ ప్రభుత్వంలో ఐదుగురు ఉప ముఖ్యమంత్రులను జగన్ నియమించుకున్నారు.ఈ ఐదుగురి ఎంపికకు ప్రాంతాలు, కులాల లెక్కలు సరిచూసుకుని మరీ ఎంపికలు చేసాడు జగన్.
ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, కాపు, బీసీ వర్గాలకు చెందిన నాయకులకు ఉప ముఖ్యమంత్రులుగా నియమించుకున్నాడు.
విజయనగరం జిల్లా కురుపాం నుంచి గెలిచిన పుష్పశ్రీవాణి, ఎమ్మెల్సీ సుభాష్ చంద్రబోస్ పిల్లి, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కాపు నేత ఆళ్ల నాని, కడప జిల్లాకు చెందిన మైనారిటీ నేత అంజాద్ బాషా, చిత్తూరు జిల్లాకు చెందిన ఎస్సీ నాయకుడు కళత్తూరు నారాయణ స్వామి లు అవకాశం దక్కించుకున్నారు.అయితే ఇప్పుడు వీరి పనితీరుపై జగన్ తీవ్ర అసంతృప్తి గా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.వీరిలో మంత్రి పిల్లి సుభాష్ చంద్ర బోస్ తప్ప మిగిలిన వారి పనితీరు అంతంతమాత్రంగానే ఉన్నట్టు జగన్ కు రిపోర్ట్స్ అందాయట.
వీరివల్ల ప్రభుత్వానికి కానీ, పార్టీకి కానీ పెద్దగా కలిసివచ్చింది ఏమి లేదన్నట్టుగా జగన్ అభిప్రాయపడుతున్నారట.
నారాయణ స్వామి పరిస్థితి చూసుకుంటే చిత్తూరు జిల్లాలో రోజా, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి కీలక నాయకులు ఉన్నారు.వీరికి వాస్తవానికి పదవులతో సంబంధం లేదు.దీంతో నారాయణ స్వామి పరిస్థితి అంతంతంత్రంగానే ఉందట.
అసలు ఆయన మాట జిల్లాలో ఏ అధికారి కూడా వినే పరిస్థితి లేకపోవడంతో సైలెంట్ గా ఉంటున్నారట.ఇక ఎస్టీ వర్గానికి చెందిన పుష్ప శ్రీవాణి పరిస్థితి కూడా అదేవిధంగా ఉందట.
విజయనగరం జిల్లాకు చెందిన వాణిపై అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి బొత్స డామినేషన్ ఎక్కువగా ఉందట.కడపలో అంజాద్ బాషా పరిస్థితి కూడా అలాగే ఉంది.
ఇది సీఎం సొంత జిల్లా కావడంతో ఇక్కడ నుంచి వైసీపీలో కీలకంగా ఉన్న శ్రీకాంత్రెడ్డి, ఎంపీ అవినాష్రెడ్డి తదితరుల హవా నడుస్తోందట.ఇక పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మరో డిప్యూటీ సీఎం ఆళ్ళ నాని పరిస్థితి ఇదే రీతిలో ఉన్నట్టు తెలుస్తోంది.