ఇటీవలికాలంలో తెలుగు రాష్ట్రాల్లోని మత్స్యకారులను అదృష్టం వరిస్తోంది.ఇప్పటికే అనూహ్యరీతిలో చాలా మంది జాలరులు చేపల పుణ్యమా అని లక్షల రూపాయలు సంపాదించుకున్నారు.
తాజాగా అలాంటి అదృష్టమే ఆంధ్రప్రదేశ్ లోని మరో మత్స్యకారుడిని వరించింది.పొట్టకూటికోసం కాయకష్టం చేస్తున్న ఈ మత్స్యకారుడికి ఒకే ఒక్క చేపతో ఆర్థిక సమస్యలన్నీ సమసిపోయాయి.
దీంతో ఆ మత్స్యకారుడు ఆనందంలో మునిగి తేలుతున్నాడు.
వివరాల్లోకి వెళితే.
శ్రీకాకుళం జిల్లాలోని సీహెచ్ కపాసుకుద్ధి గ్రామ నివాసి అయిన బైపల్లి తిరుపతిరావు సముద్రంలో చేపలు పడుతూ జీవనం సాగిస్తున్నాడు.ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడితే అతడికి ఒకరోజు గడిచిపోతుంది.
అయితే సోమవారం యథావిధిగా సముద్రంలో వేటకు వెళ్లగా అతడు వేసిన వలకు దాదాపు 15 కిలోల బరువున్న ఓ కచ్చిలి చేప చిక్కింది.ఇది చూసేందుకు మామూలుగా కనిపించినా, ఆ తర్వాత అరుదైన చేప అని సదరు మత్స్యకారుడు గుర్తించాడు.
దీంతో ఎంతో సంతోషించి వేలం నిర్వహించగా, వ్యాపారులు 55,000 రూపాయలు ఇచ్చి కొనుగోలు చేశారు.దాంతో మత్స్యకారుడు తిరుపతిరావు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
రెండు, మూడు నెలల పాటు కష్టపడినా ఎక్కువగా డబ్బులు రావని, అలాంటిది ఒకేసారి ఇంత మొత్తంలో డబ్బులు రావడంతో ఎంతో ఆనందంగా ఉందని తిరుపతి రావు చెప్పుకొచ్చాడు.తనకు కనకవర్షం కురిపించిన కడలి తల్లి కి ధన్యవాదాలు తెలిపాడు.అయితే చాలా అరుదుగా దొరికే ఈ చేప లో పుష్కలంగా పోషకాలు లభిస్తాయి అని అంటున్నారు స్థానికులు.ఈ చేపల పొట్టలోని తెల్లటి నెట్టు ఔషధాల తయారీలో ఉపయోగిస్తారని వివరించారు.
అందుకే ఇది అధిక ధర పలికిందని వెల్లడించారు.గత కొన్ని రోజులుగా తూర్పు గోదావరి జిల్లాల్లో అరుదైన చేపలు వలల్లో చిక్కి మత్స్యకారుల పంట పండించాయి.
తాజాగా శ్రీకాకుళం జిల్లా వాసి కూడా సరిగ్గా సంక్రాంతికి ముందే అధిక మొత్తంలో డబ్బులు దక్కించుకొని పండగ చేసుకుంటున్నాడు.