ఏపీలో ఎన్నికల ఫలితాల ప్రకటనకు ఇంకా మూడు రోజులే సమయం ఉంది.ఏఈ లోపు ఎన్నికల ఫలితాలపై ఆసక్తిని పెంచుతూ ఎగ్జిట్ పోల్స్ కూడా బయటకు వచ్చేశాయి.
అయితే కొన్ని టీడీపీకి అనుకూలంగా వస్తే మరికొన్ని మాత్రం వైసీపీ ప్రభుత్వం ఏపీలో రావడం గ్యారంటీ అంటూ తమ ఫలితాలను ప్రకటించాయి.రకరకాల ఫలితాల ప్రకటనతో అసలు ఏపీలో ఎవరిది గెలుపు అనేది మాత్రం స్పష్టంగా తేలకపోవడం అందరిని కన్ఫ్యూజ్ చేస్తోంది.
ఈ నేపథ్యంలోనే అసలు ఓటరు ఎవరివైపు ఎక్కువ మొగ్గుచూపాడు అనేది ఎవరికీ అంతు చిక్కడంలేదు.తెలుగుదేశం, వైసీపీ రెండు పార్టీలు తమదే అధికారం అంటూ హడావుడి చేస్తున్నాయి.
రాష్ట్రంలో ఈసారి మహిళ ఓటింగ్ బాగా పెరిగింది.ముఖ్యంగా డ్వాక్రామహిళలు పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొన్నారు.
ఆ ఓటింగ్ ఎవరికి గంపగుత్తగా పడ్డాయనేది క్లారిటీ రావడంలేదు.ఏపీలో డ్వాక్రా మహిళలు దాదాపు 90 లక్షల మంది వరకూ ఉన్నారు.గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు డ్వాక్రా రుణ మాఫీ ప్రకటించారు.కానీ అది సక్సెస్ చేయలేకపోయారు.
కానీ ఎన్నికల ముందు మాత్రం హడావుడిగా పసుపు కుంకుమ పేరిట ఒక్కొక్క మహిళకు నాలుగు విడతలుగా పదివేల రూపాయలు ప్రకటించారు.అవి వారి అకౌంట్ లో కూడా పడిపోయాయి.
ఇది టీడీపీకి ప్లస్ పాయింట్ అని భావిస్తుండగానే మరోవైపు వైసీపీ అధినేత జగన్ ఎన్నికల హామీల్లో డ్వాక్రా గ్రూపులను టార్గెట్ చేశారు.తాము అధికారంలోకి వచ్చిన వెంటనే నాలుగు విడతలుగా డ్వాక్రా మహిళల రుణమాఫీని చేస్తానని ప్రకటించి ఆకట్టుకునే ప్రయత్నం చేసారు.
వాస్తవానికి డ్వాక్రా రుణాలు పెద్ద సంఖ్యలో మహిళలు తీసుకున్నారు.బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుని వడ్డీలు చెల్లిస్తున్నారు.దీంతో జగన్ పార్టీ డ్వాక్రా మహిళలు రుణమాఫీ పై ఆకర్షితులయ్యారని భావిస్తోంది.ఈ విధంగా రెండు పార్టీలు కూడా మహిళా ఓటర్లపైనే నమ్మకం పెట్టుకుని ఉన్నారు.ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే డ్వాక్రా రుణ మాఫీ గాని, పసుపు కుంకుమపై కానీ మహిళలు ఆకర్షితులయ్యే అవకాశం లేదంటున్నారు.వారు అనుకున్న పార్టీకే ఓటు వేస్తారని, భర్తల ప్రభావం కూడా ఓటింగ్ పై ప్రభావం చూపుతుందంటున్నారు.
కౌంటింగ్ తేదీ దగ్గర పడుతున్న సమయంలో పసుపు , కుంకుమ, రుణమాఫీల లెక్కల్లో రెండు ప్రధాన పార్టీలు బిజీగా ఉన్నాయి.అయితే జనం నాడే అర్ధం కాకా అయోమయంలో ఉన్నారు.