ఈఎస్ఐ పరికరాల కొనుగోళ్లు, అవినీతికి సంబంధించి టీడీపీ నాయకుడు, టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.దాదాపు రెండు మాసాలుగా ఆయన జైలు జీవితం (ఆసుపత్రి) గడుపుతున్నారు.
ఆయనకు బెయిల్ కూడా దక్కలేదు.దాదాపు 300 కోట్ల మేరకు ఖజానాకు నష్టం కలిగించారని అప్పట్లోనే ఏసీబీ అధికారులు అచ్చెన్నపై ఆరోపణలు చేశారు.తర్వాత దీనిని రు.150 కోట్లకు తగ్గించారు.ఇక, ఈ క్రమంలో ఏమైందో ఏమో.తాజాగా అసలు అచ్చెన్నకు ఒక్కరూపాయి కూడా అవినీతి సొమ్ము అంటలేదని, కేవలం ఆయన సిఫారసు మాత్రమే చేశారని చెప్పుకొచ్చారు. ఈ తాజా పరిణామంతో ఒక్కసారిగా టీడీపీ వర్గాలు ఉలిక్కి పడ్డాయి.మరి అచ్చెన్న ప్రమేయం లేనప్పుడు.ఆయన అవినీతి సొమ్ము తినకపోయినప్పుడు ఆయనను ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించాలి? కానీ, టీడీపీ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.ఇక, ఈ విషయంపై వైఎస్సార్సీపీ లోనూ చర్చ జరుగుతోంది.
అయితే, ఎవరూ మాట్లాడడం లేదు.ఈ పరిణామాలు రాజకీయంగా చర్చకు వచ్చాయి.
అచ్చెన్నాయుడు వంటి బలమైన నాయకుడిని వైఎస్సార్ సీపీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం చాన్నాళ్లుగా జరుగుతోంది.
గతంలో ఆయన ప్రభుత్వాన్ని విమర్శించడం, అసెంబ్లీలోనే సీఎం జగన్ను టార్గెట్ చేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే అచ్చెన్నను లాగేస్తే.టీడీపీకి బలం తగ్గుతుందనే భావన వైఎస్సార్ సీపీలో ఉంది.
అయితే, దీనికి ఆయన ఒప్పుకోడని తెలుసు.తన అన్నకాలం నుంచి కూడా అచ్చెన్న పార్టీలోనే ఉన్నారు.
ఈ క్రమంలోనే ఆయనను జైలు పాలు చేశారనే విమర్శలు ఉన్నాయి.ఇక, ఇప్పుడు ఈ అరవై రోజుల్లో ఏం జరిగింది ? అచ్చెన్నపై హఠాత్తుగా ఏసీబీ డీజీ స్థాయి అధికారి వచ్చి క్లీన్ చిట్ ఇవ్వడం వెనుక ఏం ఉంది? అనే ప్రశ్నలకు ప్రస్తుతానికి సమాధానం చెప్పడానికి ఎవరూ ధైర్యం చేయడం లేదు.
అయితే, ఆయన వైస్సార్సీపీలోకి వచ్చేందుకు అయినా.అంగీకరించి ఉండాలి.లేదా.టీడీపీలోనే ఉన్నా తటస్థంగా ఉండాలని నిర్ణయించుకునైనా ఉండాలని మాత్రమే ప్రస్తుతానికి తేలిన విషయం.
ఏదేమైనా అచ్చెన్న వ్యవహారంలో రాజకీయంగా కీలక ఘట్టం అయితే జరిగిందనేది వాస్తవం.మరి అది ఏంటనేది తేలాలంటే.
కొంత వెయిట్ చేయకతప్పదు.