వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్ ఏ విషయంలోనూ భయపడరు.దేనినైనా ఎదుర్కొనేందుకు ఆయన ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు.
సాక్షాత్తు రాజ్యాంగ వ్యవస్థలతో నూ తలపడేందుకు ఇటీవల కాలంలో సిద్ధమవుతున్న సంఘటనలు ఎన్నో చూస్తూనే ఉన్నాము.తనకు ప్రజా సంక్షేమమే ముఖ్యమని, ఈ విషయంలో ఎక్కడ వరకు ఆయన వెళ్లేందుకు అయినా సిద్ధమని జగన్ పదేపదే చెబుతూ ఉంటారు.
అయితే జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పూర్తిగా తన క్యాంపు కార్యాలయానికి పరిమితమై పోతున్నారు.అక్కడ నుంచి కీలక నిర్ణయాలు తీసుకుంటూ, ప్రజా పరిపాలన పై దృష్టి పెట్టారు.
ఇక తాను క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయాల్సిన అవసరం లేదని, తాను తీసుకున్న నిర్ణయాలు పూర్తిగా అమలు కావాలంటే, అధికారులు సక్రమంగా విధులు నిర్వహించి, ప్రభుత్వ ఉద్దేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తే సరిపోతుంది అనే అభిప్రాయంలో జగన్ ఉంటూ వస్తున్నారు.
ఇక అన్ని వ్యవహారాల నూ, గ్రామ వాలంటీర్ల ద్వారానే చేస్తూ, ప్రజలకు ప్రభుత్వ పథకాలను చేరువ చేయడం లో జగన్ సక్సెస్ అవుతూ వస్తున్నారు.
ఇంత వరకు బాగానే ఉన్నా , ఇటీవల ఏపీలో పెద్దఎత్తున వరదలు సంభవించి, ప్రజలకు భారీగా ఆస్తి, పంట నష్టం జరగడం వంటి ఎన్నో చోటు చేసుకున్నాయి.అయినా, జగన్ నేరుగా ఎవరినీ పరామర్శించేందుకు జిల్లాల వారీగా పర్యటనలు చేపట్టకపోవడం, అదే సమయంలో టిడిపి యువ నాయకుడు నారా లోకేష్ వరద ప్రభావిత ప్రాంతాల్లో ట్రాక్టర్ మీద తిరుగుతూ, ప్రభుత్వంపై విమర్శలు చేసినా, వాటిని తిప్పి కొట్టడంలో సక్సెస్ అవ్వకపోవడం వంటి వ్యవహారాలు ఎన్నో చోటు చేసుకున్నాయి.
జగన్ జిల్లాల పర్యటన చేపట్టకపోవడంతో, ప్రజల నుంచి విమర్శలు వచ్చాయి.
ఆయన కార్యాలయంలోనే ఉండేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు తప్ప, జనంలోకి వెళ్లేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.రాష్ట్రంలో ఎక్కడ ఏ సంఘటన లు జరిగినా, జగన్ మాత్రం జనాల్లోకి రాకపోవడంతో, ఆయన భయపడుతున్నారని, వైసీపీ ప్రభుత్వం పై ప్రజా వ్యతిరేకత పెరిగిందని, ఎన్నో కామెంట్స్ వస్తున్నా, ఎక్కడ ఆయన స్పందించడం లేదు.ఈనెల నాలుగో తేదీన పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు జగన్ వెళ్లారు.
పార్టీ కి సంబంధించి ఓ కీలక నాయకురాలు కుమార్తె వివాహానికి హాజరయ్యే నిమిత్తం వెళ్లినా, ఆ సందర్భంగానే కొన్ని శంకుస్థాపన లు చేపట్టారు.అయితే ఆ పర్యటనకు ఎప్పుడూ లేనంత స్థాయిలో భద్రతను ఏర్పాటు చేశారు.
దీంతో నిజంగా జిల్లాల్లో పర్యటించేందుకు జగన్ జంకుతున్నారా ? అనే అనుమానం ఆ పార్టీ నాయకుల్లో నూ వ్యక్తం అవుతోంది.ఎవరు ఎన్ని అనుకున్నా, జగన్ మాత్రం మౌనం వీడడం లేదు.