రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు మంచి స్నేహితులు అనే సంగతి తెలిసిందే.వ్యక్తిగతంగానూ, రాజకీయంగానూ ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు వెళ్తున్నారు.
ఒకరి పథకాలు మరొకరు తమ తమ రాష్ట్రాల్లో అమలు చేసుకుంటూ ఒకరిమీద ఒకరు ప్రశంసలు కురిపించుకుంటూ వస్తున్నారు.అదేవిధంగా ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ సర్పంచ్ ల అధికారాలు, విధుల విషయంలో ఎటువంటి కఠినమైన నిబంధనలు తీసుకు వచ్చిందో అటువంటి కఠినమైన నిబంధనలు ఇప్పుడు ఏపీలో అమలు చేసేందుకు జగన్ ప్రభుత్వం సిద్ధమవుతోంది.
ఈ మేరకు ఏపీ పంచాయతీ రాజ్ చట్టాన్ని మరింత కఠినతరం చేసేందుకు, క్షేత్రస్థాయిలో ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించుకుంది.
ఎన్నికల్లో గెలిచిన వారిపై అనర్హత వేటు వేయడంతో పాటు, మూడేళ్ల జైలు శిక్ష విధించే విధంగా పంచాయతీ రాజ్ చట్టం లో సవరణలు తీసుకువచ్చారు.
అంతేకాకుండా ఈ ఎన్నికల్లో ఎవరైనా అవినీతి, అక్రమాలకు పాల్పడితే వెంటనే సమాచారం అందేలా నిఘా యాప్ ను జగన్ ప్రారంభించారు.ప్రభుత్వం పంచాయతీ రాజ్ చట్టం లో తీసుకొచ్చిన సవరణల ప్రకారం ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేయక పోయినా, గ్రామ సభలు నిర్వహించకపోయినా ,బాధ్యులైన సర్పంచ్, ఉప సర్పంచ్ లను తమ పదవుల నుంచి తప్పించే విధంగా నిబంధనలు తీసుకువచ్చారు.
కీలక విషయాల్లో గ్రామసభలు నిర్వహించకుండా సర్పంచులు నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రభుత్వం దృష్టికి వస్తే, నిబంధనలు ఉల్లంఘించిన సర్పంచ్ లను తొలగించేందుకు సర్వాధికారాలు కలెక్టర్లకు అప్పజెప్పారు.
అంతేకాకుండా, పంచాయతీ రాజ్ చట్టం లో కొత్తగా తీసుకువచ్చిన నిబంధనల ప్రకారం ప్రతి సర్పంచ్, ఉప సర్పంచ్ స్థానికంగానే అందుబాటులో ఉండాలి.అలాగే ప్రతిరోజు పంచాయతీ కార్యాలయానికి రావడంతోపాటు తమకు ఇచ్చిన అధికారులు దుర్వినియోగం చేసినా, అవినీతికి పాల్పడినా వీరిని తప్పించేందుకు కలెక్టర్లకు అధికారాలు కట్టబెట్టారు.సర్పంచ్ పదవి నుంచి ఎవరైనా ఉద్వాసనకు గురయితే వారు ప్రభుత్వానికి అప్పీల్ చేసుకునేందుకు 30 రోజుల సమయాన్ని కల్పించారు.
ఈ సమయంలో అవిశ్వాసం మినహా మిగతా అన్ని సమావేశాలకు సర్పంచ్ హాజరు కావచ్చు.నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నట్లు తేలితే సర్పంచ్ లను ఆరు నెలల పాటు సస్పెండ్ చేసే అధికారం కూడా కలెక్టర్లకు కట్టబెట్టారు.
ఇటువంటి ఎన్నో కఠినమైన నిబంధనలు తీసుకురావడంతో వైసీపీ మినహా మిగతా రాజకీయ పక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.