బీజేపీ పెద్దల రాజకీయం ఏమిటో ఎవరికీ అంతుపట్టడం లేదు.ఒకపక్క ప్రాంతీయ పార్టీలను దెబ్బతీసి ఆయా రాష్ట్రాల్లో బలం పెంచుకోవాలని చూస్తూనే, మరో సందర్భంలో ఆ పార్టీలతో సఖ్యతగా మెలుగుతూ, తమకు ఇబ్బంది లేకుండా చూసుకుంటోంది.
ఇప్పటికే అనేక పార్టీలు ఎన్డీఏ కు దూరం అయ్యాయి.ఈ క్రమంలో కేంద్రం ప్రవేశపెట్టే బిల్లులకు ఇబ్బంది లేకుండా చేసుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ కేంద్ర బీజేపీ పెద్దలు సఖ్యత గా ఉంటూ వస్తున్నారు.
అదే సందర్భంలో ఆయా రాష్ట్రాల్లో బీజేపీ నాయకులు టిఆర్ఎస్ వైసిపి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.ఇది ఇలా ఉండగా, గ్రేటర్ ఎన్నికలు ముగిసిన తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి, ప్రధాని మోదీని, అమిత్ షా వంటి వారిని కలిసారు.
అయితే వారు భేటీలో ఏ అంశాలు చర్చకు వచ్చాయి అనేది బయటకు చెప్పకపోయినా, ఇప్పటికే ఎన్నో కీలక అంశాలలో క్లారిటీ తెచ్చినట్లు ప్రచారం జరిగింది.అయితే రాష్ట్రంలో నెలకొన్న వివిధ సమస్యలు, కేంద్ర నిధుల విషయమై ఢిల్లీ పెద్దలను కేసీఆర్ కలిశారని, టిఆర్ఎస్ చెప్పకున్నా, వెనుక జరిగిన రాజకీయంపై అందరికీ ఆసక్తి నెలకొంది.
ఇది ఇలా ఉండగా ఈరోజు ఏపీ సీఎం జగన్ సైతం ఢిల్లీకి వెళ్తున్నారు.కేంద్ర బీజేపీ పెద్దలను కలిసి అనేక అంశాలపై చర్చించబోతున్నారు.ఈరోజు సాయంత్రం 9 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా జగన్ ను కలవబోతున్నారు.అయితే ఈ భేటీపై ఎటువంటి సందేహాలు అవసరం లేదని , ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులను ఆదుకోవాలి అని కేంద్ర బీజేపీ పెద్దలను జగన్ కలుస్తున్నట్లు వైసీపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.
దీంతో ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యం కూడా ఏర్పడింది.కొద్దిరోజుల క్రితమే ఢిల్లీలో పెద్దఎత్తున వ్యవసాయ సంస్కరణలు బిల్లుకు వ్యతిరేకంగా రైతులు నిరసన కార్యక్రమాలు చేస్తూ, భారత్ బంద్ కు పిలుపునిచ్చారు.
ఈ బంద్ కు ఏపీ ప్రభుత్వం కూడా మద్దతు తెలిపిన నేపథ్యంలో , ఆ వ్యవసాయ సంస్కరణలు బిల్లు విషయమై చర్చించేందుకు జగన్ ను ఢిల్లీ పెద్దలు పిలిపించారని ప్రచారం జరుగుతోంది.జాతీయ స్థాయిలో వ్యవసాయ సంస్కరణల్లో బిల్లు విషయమై పెద్ద ఎత్తున ప్రచారం చేయించాలని బీజేపీ భావిస్తోంది.దాదాపు 700 ప్రాంతాల్లో 700 సదస్సులను నిర్వహించాలని ప్లాన్ చేసుకుంటోంది.ఈ నేపథ్యంలోనే తెలంగాణ సీఎం కెసిఆర్, ఏపీ సీఎం జగన్ ను బీజేపీ పెద్దలు ఢిల్లీ కి పిలిచి అపాయింట్మెంట్లు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
కాకపోతే ఒక పక్క రెండు తెలుగు రాష్ట్రల ముఖ్యమంత్రులతో ఆయా రాష్ట్రాల్లో రాజకీయ శత్రుత్వం కొనసాగిస్తూనే, మరో పక్క ఢిల్లీ స్థాయిలో మంతనాలు చేస్తూ,బీజేపీ రాజకీయ ఇబ్బంది లేకుండా చూసుకోవడంలో సక్సెస్ అవుతూ వస్తోంది.